మన్సూరాబాద్, డిసెంబర్ 9: జియాలాజికల్ సర్వే ఇండియాలో పని చేయడాన్ని ఎంతో గౌరవప్రదంగా భావించి.. సంస్థ కోసం కష్టపడి పని చేసే జియో సైంటిస్టులను ప్రోత్సహిస్తామని జీఎస్ఐ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎస్. రాజు తెలిపారు. నాగోల్ డివిజన్ బండ్లగూడలోని జీఎస్ఐటీఐ ప్రాంగణంలోని ఎంఎస్. కృష్ణన్ ఆడిటోరియంలో శుక్రవారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా రిక్రూట్ చేయబడి జీఎస్ఐటీఐలో శిక్షణ పొందిన జియో సైంటిస్టుల ఓరియంటేషన్ కోర్సు ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై ప్రసంగించారు. పదకొండు నెలల సుధీర్ఘ కాలం పాటు జీఎస్ఐటీఐ శిక్షణా సంస్థ ద్వారా దేశంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో శిక్షణ పొందిన 64 మంది జియో సైంటిస్టులు ఇప్పుడు ప్రొఫెషనల్ జియాలజిస్టులుగా మారారని తెలిపారు. క్రమశిక్షణ, అంకితాభావంతో పని చేసి శిక్షణ సమయంలో నేర్చుకున్న సాంకేతికతలను ఉపయోగించి జీఎస్ఐ అభివృద్ధికి పాటుపడాలని జియాలజిస్టులకు సూచించారు. సంస్థలో కొందరు సరిగా పని చేయడంలేదని పని చేయని ఉద్యోగులను ఇంటికి సాగనంపేందుకు వెనుకాడమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సదరన్ రీజియన్ జీఎస్ఐ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సీహెచ్. వెంకటేశ్వర రావు, జీఎస్ఐ టీఐ డైరెక్టర్ ఆర్. విజయ్కుమార్, డైరెక్టర్ ప్రసాద్ భూటియా తదితరులు పాల్గొన్నారు.