సిటీబ్యూరో, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): మోదీని రాజకీయంగా ప్రశ్నించే సీఎంలపై, ఆపార్టీ ప్రతినిధులపై ఈడీ, సీబీఐ దాడులు జరుగుతున్నాయని రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు మండిపడ్డారు. అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమైన ఈ దాడులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు మాట్లాడుతూ.. రాజకీయంగా సీఎం కేసీఆర్ను ఎదుర్కొనలేకనే ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన తర్వాతే ఈడీ, సీబీఐ దాడులు విస్తృతమయ్యాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వస్తున్నదని, దీన్ని జీర్ణించుకోలేక రాజకీయంగా దెబ్బతీయాలని చేస్తున్నారని విమర్శించారు. లిక్కర్ స్కాంలో ఎలాంటి ప్రమేయం లేని ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చి వివరణ అడగడం వెనుక రాజకీయ దురుద్దేశం స్పష్టంగా కనబడుతున్నదని అన్నారు. ఇటువంటి చౌకబారు చర్యలను మానుకోవాలని హితవు పలికారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎన్నో అక్రమాలు, కుంభకోణాలు జరిగినా ఈడీ, సీబీఐ దాడులు లేవని, తెలంగాణలోనే ఈ తరహా దాడులు జరగడాన్ని తెలంగాణ ప్రజానీకం గమనిస్తున్నదని అన్నారు. విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు కొంతం గోవర్ధన్ రెడ్డి, వడియారపు రవి కుమార్, పులిగారి గోవర్ధన్ రెడ్డి, పి.అరుణ్ కుమార్, నర్సింహా చారి తదితరులు పాల్గొన్నారు.