మేడ్చల్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ)/ మేడ్చల్/దుండిగల్ : రాష్ట్రంలో వైద్యరంగం అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారించారని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సూరారంలోని మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ కళాశాల, మైసమ్మగూడలోని ఫార్మసీ కళాశాలలో సోమవారం జరిగిన ఓరియెంటేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
మల్లారెడ్డి మెడికల్ కళాశాలలో పారదర్శకంగానే ఫీజులు
మల్లారెడ్డి మెడికల్ కళాశాలలో పారదర్శకంగానే మెడికల్ విద్యార్థుల నుంచి ఫీజులు తీసుకుంటున్నట్లు మంత్రి మల్లారెడ్డి చెప్పారు. రెండు మెడికల్ కళాశాలల్లో కలిసి 400 మెడికల్ సీట్లకు ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా నిర్వహించిన కౌన్సెలింగ్లో సీటు పొందిన మెడికల్ విద్యార్థుల నుంచి ప్రభుత్వ నిబంధనల మేరకే ఫీజులు తీసుకున్నట్లు తెలిపారు.
ఐటీ తనిఖీలకు బయపడేది లేదు.!
తన కళాశాలలపై జరిగిన ఐటీ తనిఖీలపై బయపడేది లేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. తన వద్ద బ్లాక్మనీ లేదని, విద్యార్థులు చెల్లించే ఫీజులన్నీ ఆన్లైన్లో చెల్లిస్తారని పేర్కొన్నారు. తన వద్ద ఉన్న ప్రతి పైసాకు లెక్క ఉంటుందని చెప్పారు. ఐటీ అధికారులు వారిపని వారు చేసుకుపోయారని తెలిపారు. ఐటీ అధికారులకు తన వద్ద ఎలాంటి నగదు లభించలేదని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతికి తావులేకుండా అంతా పాదర్శకంగా పాలన సాగుతున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి విద్యాసంస్థల కార్యదర్శి మహేందర్ రెడ్డి, మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి, డైరెక్టర్ డాక్టర్ ప్రీతిరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.