సిటీబ్యూరో, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ): వైద్య విద్యను అభ్యసించే వారి సంఖ్య పదేండ్లలో విపరీతంగా పెరిగినప్పటికీ, దేశంలో మహిళా వైద్యుల కొరత ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం గచ్చిబౌలిలోని ఆసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆధ్వర్యంలో జరిగిన ‘ఉమెన్ ఇన్ మెడిసిన్ కాంక్లేవ్’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం బలమైన మహిళా శ్రామికశక్తిని భారత్ కలిగి ఉందన్నారు. వైద్య, ఆరోగ్య రంగంలో మహిళలే ముఖ్య భూమికను పోషిస్తున్నారని, కరోనా వ్యాక్సిన్ తయారీలోనూ కీలకపాత్రను పోషించారని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. లైఫ్ సైన్సెస్కు కేంద్రంగా ఉన్న హైదరాబాద్కు ఆధునిక ఐటీ సాంకేతికత కలిసొచ్చే విషయమని తెలిపారు.
ప్రత్యేక అంకాలజీ యూనిట్
తెలంగాణలో 4 కోట్ల ప్రజల డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ను రూపొందించడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. వైద్యం, ఐటీ టెక్నాలజీని సమ్మిళితం చేసి రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాలలో పైలట్ ప్రాజెక్టును చేపట్టినట్లుగా తెలిపారు. ఈ జిల్లాల పరిధిలో జరిగిన సర్వేలో మహిళల్లో అంకాలజికల్, కార్డియాలజిక్ లక్షణాలతో బాధపడుతున్నవారే ఎక్కువగా ఉన్నట్లుగా తేలిందన్నారు. అందుకే భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అన్ని జిల్లా కేంద్రాల్లో 33 మెడికల్ కాలేజీలను స్థాపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా వివరించారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రత్యేకంగా అంకాలజీ యూనిట్తో కూడిన మెడికల్ కాలేజీని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ఇదిలా ఉంటే కరోనా సమయంలో ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు ఆసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ చేసిన కృషిని ఆయన అభినందించారు. అంతకుముందు స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి మాట్లాడుతూ గ్రామీణ మహిళలకు వ్యక్తిగత పరిశుభ్రత, నిరక్షరాస్యత వంటి సమస్యలు ప్రమాదకరమైనవని అన్నారు.
శక్తిరూపాలైన లక్ష్మి, మహకాళీ తరహాలోనే నేటి సమాజంలో మహిళలు ఎన్నో పాత్రలను పోషిస్తున్నారని ఏసీబీ డైరెక్టర్ శిఖా గోయల్ వివరించారు. నటి అక్కినేని అమల మాట్లాడుతూ సవాళ్లను స్వీకరించి ముందుకు వెళ్లినప్పుడు మహిళల శక్తి సామర్థ్యాలు బయటపడతాయని తెలిపారు. తప్పులను సరిదిద్దుకున్నప్పుడే ప్రపంచ వేదికపై విజేతగా నిలబడగలుగుతామని బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ అన్నారు. మూడు సెషన్లలో జరిగిన ఈ కాంక్లేవ్లో మహిళ వైద్యులు వర్క్ లైఫ్ బ్యాలెన్స్, సోషల్ ఎంట్రపెన్యూర్ షిప్ వంటి అంశాలపై పరిశోధన పత్రాలను అందజేయగా 400మందికి పైగా మహిళా వైద్య నిపుణులు పాల్గొన్నారు. దేశంలోనే తొలిసారిగా వైద్యరంగంలో మహిళల సముచిత స్థానాన్ని గుర్తించేందుకు ఈ కాంక్లేవ్ నిర్వహించినట్లుగా ఏఐజీ చైర్మన్ డా. నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎండీ డా. సి. మల్లిఖార్జున్, ఫెర్నాండెజ్ హాస్పిటల్ ఎండీ డా. ఈవిత ఫెర్నాండెజ్, స్టార్ హాస్పిటల్ చీఫ్ కార్డియో సర్జన్ డా. గోపీచంద్ మన్నం తదితరులు పాల్గొన్నారు.