అల్లాపూర్, డిసెంబర్ 3 : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి పేదల అభ్యన్నతే ధ్యేయంగా పనిచేస్తున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం బస్తీ దవాఖానల ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నది. దీంతో పేదల ప్రజలు ఫిదా అవుతున్నారు. ఫలితంగా ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా బస్తీ దవాఖానలకే వెళ్తున్నారు. ఇక ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానల చుట్టూ తిరగాల్సిన అవసరంలేదని ప్రజలు దీమా వ్యక్తం చేస్తున్నారు. బస్తీ దవాఖానల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించి ఇంటికి సమీపంలోనే ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. చిన్న ఆరోగ్య సమస్యలకు దూర ప్రాంతంలో ఉన్న ఉస్మానియా, గాంధీ దవాఖానలకు వెళ్లాల్సిన పరిస్థితులు తప్పాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లాపూర్ డివిజన్ పరిధిలో పండిత్ నెహ్రూనగర్, రాజీవ్గాంధీనగర్లో ఉన్న రెండు బస్తీ దవాఖానలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారాయని ప్రజలు పేర్కొంటున్నారు.
అందుబాటులో సేవలు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తీసిపోని రీతిలో బస్తీ దవాఖానల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు వైద్య సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా అవసరమైన పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందిస్తున్నారు. ఇందుకోసం ఒక వైద్యురాలు, స్టాఫ్ నర్సు, ఒక సిబ్బంది అందుబాటులో ఉంటారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు సైతం చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి రోజూ 50 నుంచి 60 మంది రోగులకు వైద్య పరీక్షలతోపాటు బీపీ, షుగర్, థైరాయిడ్, మలేరియా, డెంగీ, దగ్గు, చర్మ సమస్యలు, చిన్న పిల్లల వ్యాధులకు పరీక్షలు చేస్తున్నారు.
బుధ, శని వారాల్లో చిన్నారులకు టీకాలు
వారంలో బుధ, శని వారాల్లో ఏఎన్ఎంలు అందుబాటులో ఉండి చిన్నారులకు, గర్భవతులకు టీకాలు వేస్తున్నారు. రోగుల నుంచి రక్త, మూత్ర నమూనాలను సేకరించి తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ల ద్వారా 67 రకాల వ్యాధులకు నిర్ధారణ పరీక్షలు ఉచితంగానే చేస్తున్నారు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.