కందుకూరు, డిసెంబర్ 3 : పదో తరగతి పరీక్షల్లో అగ్రగామిగా నిలిపేందుకు విద్యాశాఖ అధికారులు పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు ఫిబ్రవరి 23 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు 100 శాతం సిలబస్ పూర్తి చేసేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జనవరి నుంచి స్లిప్ టెస్టులు నిర్వహించి, పాఠ్యాంశాల వారీగా విద్యార్థుల ప్రతిభను గుర్తించి, ఉత్తమ ఫలితాలు రాణించేలా విద్యార్థులను తీర్చిదిద్దనున్నారు.
మండలం పరిధిలో 11 జిల్లా పరిషత్ కేజీబీవీ, మోడల్, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటికి తోడుగా ప్రైవేట్ పాఠశాలలు సైతం ఉన్నాయి. వీటిలో దాదాపు 900 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
శిక్షణ ప్రారంభించాం..
జిల్లా అధికారుల ఆదేశాల మేరకు శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించాం. మండల పరిధిలోని 11 జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం తరగతులు జరుగుతున్నాయి. విద్యార్థులు కూడా సమయానికి హాజరవుతున్నారు. ఇది విద్యార్థులకు మంచి అవకాశం.
– నిమిని వెంకటేశ్, సీఆర్పీ
అగ్రగామిగా నిలిపేందుకు..
విద్యార్థులు పదిలో ఉత్తమ ఫలిలాలు సాధించాలని జిల్లా అధికారులు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. విద్యార్థుల కోసం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ అవకాశం ఎప్పుడు రాదు. సద్వినియోగం చేసుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలి.
– కృష్ణయ్య, ఎంఈవో
ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు
ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యాశాఖ అధికారులు తీసుకున్న నిర్ణయం తమకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ప్రత్యేక తరగతులకు హాజరై శ్రద్ధగా చదువుకుంటున్నాం.
– మనోజ్, పదో తరగతి విద్యార్థి