సిటీబ్యూరో, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : కాలుష్య నియంత్రణపై పర్యావరణ శాఖ దృష్టి పెట్టింది. ముఖ్యంగా భవన నిర్మాణ పనులు అధికంగా ఉండే ప్రాంతాల్లో కలుగుతున్న కాలుష్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న నిర్మాణ సంస్థలపై చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. దీంతో రెసిడెన్షియల్ ప్రాంతాలకు సమీపంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులు, క్రషర్లు, ఇతర ఫ్యాక్టరీల వద్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
భారీ ప్రాజెక్టులు, విలాసవంతమైన అపార్టుమెంట్లకు కేంద్రంగా ఉన్న వెస్ట్ సిటీ అనూహ్య రీతిలో అభివృద్ధి చెందుతున్నది. ఆయా ప్రాంతాల్లో నివాస సముదాయాలకు సమీపంలోనే భారీ భవనాలు, నిర్మాణ రంగానికి అనుబంధ సంస్థలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణంలో భారీగా దుమ్ము, ధూళీ కణాలు వ్యాప్తి చెందుతున్నాయి. అయితే ప్రాజెక్టులు చేపట్టే ముందు కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నా.. సంస్థల నిర్లక్ష్యంతో పర్యావరణంలో మార్పులు వస్తున్నాయి.
అమలు కాని నియంత్రణ చర్యలు
భవన నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టే క్రమంలో పలు జాగ్రత్తలు చేపట్టింది. ఇందులో భాగంగా వాహనాల రాకపోకలు ఉండే ప్రాంతాల్లో వాటర్ స్ప్రింక్లింగ్, దుమ్ము వ్యాప్తి చెందకుండా చుట్టూ పరదాలు, నిర్మాణ ప్రాంతాల్లో నీటిని వెదజల్లడం వంటి పనులు చేయాలని భారీ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇచ్చే క్రమంలోనే నిబంధనలు జారీ చేస్తారు. కానీ నిర్వహణ వ్యయాన్ని భారంగా భావించి కొన్ని సంస్థలు పెడచెవిన పెట్టడంతో స్థానికులకు సమస్యగా మారుతున్నది. దీంతో రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్న ప్రధానమైన ప్రాంతాలు కలుషిత ప్రాంతాలుగా మారుతున్నాయి. ఇందులో వట్టినాగులపల్లి, కోకాపేట్, గౌలిదొడ్డి, గోపన్ పల్లి, కొల్లూరు, కొత్వాల్గూడ్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, గచ్చిబౌలి, నానక్ రాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో దుమ్ము ఎక్కువగా వ్యాపిసున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. కాలుష్య నియంత్రణ కోసం నిబంధనలు పక్కాగా అమలు చేసేందుకు పీసీబీ అధికారులు దృష్టి సారించారు.
క్రషర్లపై కొరడా…
భవన నిర్మాణానికి అవసరమైన స్టోన్, రాక్, రోబో సాండ్ కంపెనీలతో వాతావరణంలో దుమ్ము విపరీతంగా చేరుతుందని ఫిర్యాదులు ఉన్నాయి. ఈ క్రమంలో నగరం చుట్టూ ఉన్న క్రషర్లు కొత్త సమస్యలను కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో స్థానికుల ఫిర్యాదుతో చర్యలు చేపట్టిన పీసీబీ అధికారులు 8 స్టోన్ క్రషర్ యూనిట్లపై కొరడా ఝుళిపించారు. ఒక్కో క్రషర్పై ఏకంగా రూ. 10 లక్షల నుంచి రూ. 80లక్షల జరిమానా విధించి దాదాపు రూ. 5కోట్లు వసూలు చేశారు. నిబంధనలు పాటించకపోతే యూనిట్లను మూసివేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
మంత్రి ఆదేశాలు..
మంత్రి కేటీఆర్ ఆదేశాలతో నగరంలో భవన నిర్మాణ ప్రాంతాల్లో పీసీబీ అధికారులు ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా నిబంధనలు అతిక్రమించే కంపెనీల పట్ల కఠినంగా వ్యవహరించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో అధ్యయనం చేసి అధికారులు, స్థానికుల నుంచి వచ్చే ఫిర్యాదులపై చర్యలు తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిబంధనలు పక్కాగా అమలు చేయాలని, అవసరమైతే కంపెనీలను మూసివేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.