శాలిబండ, నవంబర్ 28 : రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని అర్థంచేసుకుని అమలు చేయాల్సిన అవసరం ఉందని ఉస్మానియా యూనివర్సిటీ న్యాయ కళాశాల డీన్ ఆచార్య గాలి వినోద్కుమార్ తెలిపారు. సోమవారం సిటీ కాలేజీలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సామాజిక శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ.. రాజ్యాంగం సామాజిక, ఆర్థిక,రాజకీయ సమానతను ప్రభోదించే విప్లవ గ్రంథమని అభివర్ణించారు. విధివిధానాలను అమలు పర్చటంలో ప్రభుత్వం, ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు.
రాజ్యాంగ ఫలాలు అందరికీ అందించాలి..
రాజ్యాంగ ఫలాలు అందరికీ అందించవలసిన అవసరం ఉందని.. అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించాలని ఆయన ఉద్భోదించారు. రాజ్యాంగంలో తాను పొందుపర్చలేని అంశాలను తన స్టేట్ సోషలిజం గ్రంథం ద్వారా అంబేద్కర్ ప్రచారం చేశారని తెలిపారు. అన్ని దేశాలు అంబేద్కర్ను ప్రపంచ మేధావిగా గుర్తించాయని తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం సైతం అంబేద్కర్కు గౌరవ డాక్టరేట్ అందించి గౌరవించిందన్నారు. తాను అంబేద్కర్ ముందు మాత్రమే తల వంచుతానని మాజీ అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటించి తన విధేయతను చాటుకున్నారని గుర్తు చేశారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాట్లాడిన వేదిక నుంచి తనకు మాట్లాడే అవకాశం రావడం అదృష్టమని, సిటీ కాలేజీ ఏర్పాటు నుంచి నేటి వరకు విశిష్టతను సాధించిందని గుర్తు చేశారు. సమావేశంలో సిటీ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ ఐజాజ్ సుల్తానా, అధ్యాపకులు విప్లవ దత్ శుక్లా, యాదయ్య, రత్న ప్రభాకర్; భాస్కర్, శంకర్కుమార్, పావని, శ్రీనివాస్, సారయ్య దొర, కృష్ణవేణి, శాంతి, సుదక్షణ పాల్గొన్నారు.