మియాపూర్, నవంబర్ 28 : శుభకార్యాల నిర్వహణ సహా సమావేశాల నిర్వహణకు సకల సౌకర్యాలతో వేదికలు సిద్ధం అవుతున్నాయి. వేలు లక్షలాది రూపాయలతో ప్రయివేటు ఫంక్షన్హాళ్ల ధరలు నానాటికీ కొండెక్కుతుండటం.. పేద మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో లేకపోతుండటంతో.. వారికోసం ప్రభుత్వం వేదికలను సిద్ధం చేస్తున్నది. ప్రయివేటు, కార్పొరేట్లకు తీసిపోని విధంగా అధునాతన వసతులతో సరసమైన ధరలతో అన్ని వర్గాల ప్రజలకు వాటిని అందించేందుకు ప్రభుత్వం సంకల్పించి నిర్మాణాలను చేపడుతున్నది. ఇందులో భాగంగా శేరిలింగంపల్లి జోన్ పరిధిలో 6 అధునాతన మల్టీపర్పస్ ఫంక్షన్హాళ్లు సిద్ధం అవుతున్నాయి. ఇందులో ఇప్పటికే ఒకటి నిర్మాణం పూర్తి చేసుకుని సేవలను అందిస్తుండగా.. మరో 4 నిర్మాణ దశలో ఉన్నాయి. మరొకటి టెండర్ దశను పూర్తి చేసుకోవాల్సి ఉన్నది. కాగా నిర్మాణంలో ఉన్న 4 డిసెంబర్ చివరి కల్లా పనులు పూర్తికానున్నాయి.
ఆధునిక వసతులతో నిర్మాణం..
శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని శేరిలింగంపల్లి, యూసుఫ్గూడ, ఆర్సీపూర్ పటాన్చెరు సర్కిళ్ల పరిధిలో మల్టీపర్పస్ ఫంక్షన్హాళ్లను ప్రభుత్వం నిర్మిస్తున్నది. రూ.16 కోట్ల వ్యయంతో వీటిని సకల వసతులతో నిర్మిస్తున్నారు. శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో పాపిరెడ్డి కాలనీ, గోపన్పల్లి ప్రాంతాలలో, యూసుఫ్గూడ సర్కిల్ పరిధిలో హెచ్ఎఫ్నగర్, వెంగళ్రావునగర్ ప్రాంతాలలో, ఆర్సీపూర్ పటాన్చెరు సర్కిల్ పరిధిలో నిర్మాణం పూర్తి చేసుకున్నది. చందానగర్ సర్కిల్కు ఒక్కటి కూడా మంజూరు కాలేదు. కాగా యూసుఫ్గూడ సర్కిల్ పరిధిలోని ఎర్రగడ్డ జనప్రియనగర్కు మంజూరైన మల్టీపర్పస్ హాల్ టెండర్ దశలో ఉన్నది. గోపన్పల్లి, పాపిరెడ్ది కాలనీలలో నిర్మాణ పనులు 60, 70 శాతం పూర్తి కాగా, యూసుఫ్గూడ సర్కిల్ పరిధిలో హెచ్ఎఫ్నగర్లో పనులు 35 శాతం, వెంగళ్రావునగర్లో 10 శాతం పూర్తయ్యాయి. పనులను ముమ్మరంగా చేపట్టి డిసెంబర్ చివరి కల్లా నిర్మాణం పూర్తి చేస్తామని జోనల్ అధికారులు పేర్కొన్నారు. కాగా ఈ వేదికలలో కింది అంతస్తులో విశాలమైన డైనింగ్, మొదటి అంతస్తులో విశాలమైన వేదిక, ప్రత్యేక కిచెన్, పార్కింగ్ సహా ఇతర వసతులను కల్పిస్తున్నారు. పనులను జడ్సీ శంకరయ్య ఇటీవల సందర్శించి వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ఈ మల్టీపర్పస్ హాళ్లు ఎంతో సౌకర్యాన్ని కల్పించనున్నాయి.