సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : పారిశుధ్య నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. పెట్టుబడులకు స్వర్గధామంగా నిలుస్తున్న హైదరాబాద్ నగరాన్ని అద్దంలా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తూ..అభివృద్ధి చేస్తున్నది. మరోవైపు పారిశుధ్య కార్మికులు, ఉద్యోగుల సంక్షేమానికి పాటుపడుతూనే.. నిబంధనలు ఉల్లంఘించే ఉద్యోగులు, సిబ్బంది పట్ల కొరడాఝులిపిస్తున్నది. ప్రగతి విషయంలో రాజీలేదని స్పష్టం చేస్తున్నది. స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్యంగా సమస్యలు పరిష్కరించుకుంటూ వడివడిగా ముందుకెళ్తున్నది. ఇంటింటి చెత్త సేకరణలో నిర్దేశించిన నెలవారి రుసుంను మాత్రమే వసూలు చేయాలని, ఇష్టారీతిలో వసూలు చేస్తే సహించేది లేదని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే స్వచ్ఛ ఆటోను మరొకరికి కేటాయిస్తామని మేయర్ స్పష్టం చేశారు. మంగళవారం సీతాఫల్ మండి సరిల్ పారిశుధ్య కార్మికులు, జవాన్లు, ఎస్ఎఫ్ఏలతో కలిసి మేయర్ పారిశుధ్యంపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోడ్లు పరిశుభ్రంగా లేకపోవడంతో విపరీతంగా ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. అలాగే స్వచ్ఛ ఆటో డ్రైవర్ పూర్తి స్థాయిలో చెత్త సేకరణ చేయకుండా.. నెలసరి రుసుమును నిర్దేశించిన ప్రకారం కాకుండా ఇష్టమొచ్చినట్లు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా సక్రమంగా పని చేయకపోతే వారిని తొలగించి ఇతరులను నియమిస్తామని హెచ్చరించారు. ఇంత మ్యాన్ పవర్ ఉన్నప్పటికి సరిగా పని చేయకపోవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్లు, జవాన్లు బాధ్యతాయుతంగా పని చేయడం లేదని, ఎవరైనా సక్రమంగా పని చేయకపోతే వారిని తొలగించి ఇతరులను నియమిస్తామని హెచ్చరించారు. ఆరోగ్య సమస్యలు, వయస్సు దాటిన వారు ఉన్న నేపథ్యంలో వారి ఇంట్లో ఉన్న అర్హత గల వారిని నియమిస్తామన్నారు.
ఎస్ఎఫ్ఏల పర్యవేక్షణ తప్పనిసరి..
ఎస్ఎఫ్ఏలు ప్రతి రోజూ పారిశుధ్య కార్మికుల రోజు వారీగా అటెండెన్స్ తీసుకోవడం, వారికి కేటాయించిన ఏరియాలో శుభ్రం చేస్తున్నారో లేదో పరిశీలన చేయాలని అడిషనల్ కమిషనర్ బి. సంతోష్ అన్నారు. సరిల్లో కనీసం 5 లేదా 6 స్వచ్ఛ ఆటోలు ఉదయం 6గంటల నుండి 7గంటల వరకు తప్పనిసరిగా హాజరు పరిశీలన, సకాలంలో రాకున్నా, వాహనం రాకున్నా కారణాలు తెలుసుకొని వాహనం రిపేర్లో ఉన్న పక్షంలో వేరే వాహనాన్ని ఆలస్యం అయినా కేటాయించిన ప్రాంతానికి పంపించాలన్నారు. 8 గంటలలోపు జీవీపీ వద్ద గల వ్యర్థాలను తరలించేందుకు చర్యలు తీసుకోవాలని అడిషనల్ కమిషనర్ ఆదేశించారు.
కలిసికట్టుగా పనిచేద్దాం : కార్పొరేటర్ హేమ
మనం కలిసి కట్టుగా పనిచేస్తూ పారిశుధ్య సమస్యలు లేకుండా చూడాలని కార్పొరేటర్ సామల హేమ తెలిపారు. కార్మికుల సమస్యలు తెలుసుకొని వాటిని పరిషారం కోసం కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిసి దశరథ, ఏఎంహెచ్ఓ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో డీసీ దశరథ, ఏఎంహెచ్ఓ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.