మేడ్చల్, నవంబర్ 22(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఇంట్లో జరుగుతున్న ఐటీ దాడుల నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు భారీ స్థాయిలో నిరసనలకు దిగారు. మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కుమారులు, సోదరులు, అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డి, విద్యా సంస్థల్లో జరుగుతున్న ఐటీ దాడులను నిరసిస్తూ.. మంత్రి నివాసం ముందు ఆందోళనలు చేపట్టారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా నుంచి భారీ సంఖ్యలో మంత్రి నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి మల్లారెడ్డిపై కక్ష పూరితంగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఐటీ దాడులు చేయిస్తున్నదని ఆరోపించారు. విద్యా సంస్థలు ఏర్పాటు చేసి, అనేక మందికి విద్యను అందిస్తున్న మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులు చేయించడం ఏమిటని వారు ప్రశ్నించారు.
మంత్రి మల్లారెడ్డికి జిల్లా ప్రజలతో పాటు టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అండగా నిలుస్తామన్నారు. బీజేపీ తీరును చూసి తెలంగాణ ప్రజలు ఛీ కొడుతున్నారని విమర్శించారు. బీజేపీ చీప్ ట్రిక్స్ మానుకోవాలని, ఎన్ని ఎత్తులు వేసినా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని ఏమీ చేయలేరంటూ మండిపడ్డారు. మంత్రి మల్లారెడ్డి ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు. ఐటీ సోదాలతో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను భయపెట్టాలని చూస్తున్నారని, ప్రజలు త్వరలోనే బీజేపీకి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మంత్రి మల్లారెడ్డిని బయటకు పంపించాలంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనలో మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలోని మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.