ఎల్బీనగర్, నవంబర్ 22 : వచ్చే 2030 వరకు కులాంతర సహపంక్తి వనభోజనాల ఏర్పాటుకు చేస్తున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మంగళవారం గుర్రంగూడలోని సంజీవిని వనం నందు జాగృతి అభ్యుదయ సంఘం, ఎల్బీనగర్ నియోజకవర్గ పర్యావరణ పరిరక్షణ సమితి చైర్మన్ భావన శ్రీనివాస్ అధ్యక్షతన ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఆధ్వర్యంలో సమసమాజ నిర్మాణం కోసం కార్తికమాస కులాంతర సహపంక్తి వనభోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ.. ఈమధ్య కాలంలో ఎవరి కులాలకు, వారే వనభోజనాల కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటున్నారని తెలిపారు. కానీ అన్ని కులాలకు సంబంధించి ఒకేచోట భోజనం చేయాలన్నదే నా ఆశయమని తెలిపారు. ప్రతి జీవికి జీవనాధారం ప్రకృతి అని, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదేనని చెప్పారు. గ్లోబల్ వార్మింగ్, అడవుల నరికివేత, గాలి కాలుష్యం, ప్లాస్టిక్ వంటివి పర్యావరణానికి ప్రధాన కారణమన్నారు.
వాతావరణంలో వచ్చే మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, సునామీలు, అగ్ని పర్వతాలు బద్దలవడం, ఇండస్ట్రీయల్ పొల్యూషన్ వల్ల మానవళిపై పెను ప్రభావం పడుతుందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సానుకూల మార్పునకు రైతులు, విద్యార్థులు, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు హరిత భవిష్యత్ పరిరక్షణ కోసం కృషిచేయాల్సిన అవసరముందని తెలిపారు. సకల జీవరాశులు, మానవ మనుగడ సాగించడానికి పర్యావరణ పరిరక్షణ ఎంతో ప్రధానమని తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంచి ప్రతి గ్రామంలో చెట్లు నాటాలని, పొల్యూషన్, గ్లోబల్ వార్మింగ్ తగ్గించేందుకు ప్రతిఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తించాలన్నారు. కాలనీలు, ఇండ్లల్లో ఇంకుడు గుంతలు, మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలన్నారు. పర్యావరణ కాలుష్యం అధికమవుతోందని, రాబోయే రోజుల్లో మాస్కులు పెట్టుకునే పరిస్థితి రావొద్దని అన్నారు.
అనంతరం కార్యక్రమానికి వచ్చిన వివిధ కుల బంధువులతో కలిసి ఎమ్మెల్యే సుధీర్రెడ్డి అరిటాకుల్లో భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్, మాజీ కార్పొరేటర్లు ముద్రబోయిన శ్రీనివాసరావు, జిట్టా రాజశేఖర్రెడ్డి, కొప్పుల విఠల్రెడ్డి, సాగర్ రెడ్డి, భవానీ ప్రవీణ్ కుమార్, సీనియర్ నాయకులు బిజినేపల్లి వెంకటేశ్వరరావు, వెంకటేశ్ గౌడ్, తులసి, శ్రీనివాస్, పలు డివిజన్ల అధ్యక్షులు జక్కిడి మల్లారెడ్డి, శ్రీశైలం యాదవ్, చిరంజీవి, మహేశ్ యాదవ్, సత్యంచారి, వరప్రసాద్రెడ్డి, రాజిరెడ్డి, సభ్యులు శ్రీరంగానంద్, యాదా రామలింగేశ్వర రావు, గోపాల్ దాస్, రాములు, జ్యోతి, కోటేశ్వరరావు, మూర్తి, గాంధీ, శ్యామల దేవి, కోమలి, లక్ష్మణరావు, సీతారామశర్మ, వనజ, రాజేందర్, సత్యనారాయణ, శివ, పలువురు మాజీ డివిజన్ అధ్యక్షులు, నాయకులు, పలువురు కుల సంఘాల సభ్యులు తదితరలు పాల్గొన్నారు.