బన్సీలాల్పేట్, నవంబర్ 22: బన్సీలాల్పేట్లోని పొట్టి శ్రీరాములునగర్ ‘డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీ సంక్షేమ సంఘం’ అధ్యక్షుడిగా ఎన్నికైన కె.సాయిరాజ్ మంగళవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆయనను సన్మానించి, అభినందించారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. పీఎస్ నగర్ బస్తీవాసులు గతంలో ఇరుకైన ఇండ్లలో అనేక ఇబ్బందుల నడుమ జీవించారని, వారి బాధలను స్వయంగా చూసిన తాను ప్రభుత్వం ద్వారా సకల సదుపాయాలతో ఆరు అంతస్తుల భవనంలో రెండు పడక గదుల ఇండ్లు నిర్మించి అర్హులైన లబ్ధిదారులకు అందించామని అన్నా రు. దాంతో ఆ ప్రాంతానికి కొత్తదనం వచ్చిందన్నారు. పై అంతస్తులలో ఉండేవారి కోసం లిఫ్టులను ఏర్పాటు చేశామని, దుకాణాలను ఏర్పాటు చేసి వాటి నుంచి వచ్చే అద్దెల ద్వారా లిఫ్టులు, పారిశుధ్య నిర్వహణ పనులను చేపట్టాలని ఆయన సూచించారు. కాలనీలో కుల, మత, రాజకీయాలకు అతీతంగా అందరూ కలసి మెలసి ఉండాలన్నారు. డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తేవాలని, వాటి పరిష్కారానికి తాను కృషి చేస్తానని ఆయన అన్నారు. బస్తీ ఎన్నికలలో గెలిపించిన ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బన్సీలాల్పేట్ కార్పొరేటర్ కే.హేమలత, టీఆర్ఎస్ నాయకులు కే.లక్ష్మిపతి, ప్రేమ్కుమార్, కాలనీవాసులు అశోక్, శ్రీకాంత్, కార్తిక్, రాజు, ప్రకాశ్లు పాల్గొన్నారు.
మంత్రి దృష్టికి ‘శాన్వి సివిటాస్’సమస్యలు
సనత్నగర్ లోథా సమీపంలోని ‘శాన్వి సివిటాస్’అపార్ట్మెంట్స్ నివాసితులు మంగళవారం కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ను కలిశారు. ఈ మేరకు కార్పొరేటర్, అపార్ట్మెంట్స్ ప్రతినిధులు శ్రీనివాస్రెడ్డి కలిసి అపార్ట్మెంట్స్ సమస్యలను మంత్రి తలసాని దృష్టికి తీసుకువచ్చి, పరిష్కరించవలసిందిగా మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు. దీంతో సానుకూలంగా స్పందించిన మంత్రి తలసాని శనివారం ఉదయం 10 గంటలకు జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్ విభాగం అధికారులతో కలిసి ‘శాన్వి సివిటాస్’ అపార్ట్మెంట్స్ను సందర్శిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కొలను బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.