ఖైరతాబాద్, నవంబర్ 22: ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకతను పాటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఓటరుతో ఆధార్ అనుసంధానం పద్ధతిని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో మూడు నెలలుగా జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని సర్కిళ్లలో ఈ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలోని సర్కిల్-17, 18లలో డిప్యూటీ కమిషనర్, ఈఆర్వో రజనీకాంత్ రెడ్డి పర్యవేక్షణలో బూత్ లెవల్ అధికారులు (బీఎల్వో)లు నేరుగా ఓటర్ల వద్దకు వెళ్లి అనుసంధానం చేస్తున్నారు. నేరుగా ఆన్లైన్లో చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
మార్చి వరకు గడువు
కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు 2023 మార్చి 31 వరకు ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం చేసుకునే వీలు కల్పించారు. జీహెచ్ఎంసీ పరిధిలో గరుడా యాప్ ద్వారా బీఎల్వోలు ఇంటి వద్దనే అనుసంధానం చేస్తుండగా, www. nvsp.in వెబ్సైట్లోనూ ఓటరు నేరుగా తమ ఆధార్తో అనుసంధానం చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. కాగా ఖైరతాబాద్లో పురుషులు 1,44,732, మహిళలు 1,32, 079, థర్డ్ జెండర్స్ 22, మొత్తం 2,76, 833 మంది ఓటర్లు ఉన్నారు. 245 బూత్లు ఉండగా, అదే సంఖ్యలో బీఎల్వోలు ఉన్నారు.
స్వచ్ఛందంగా అనుసంధానం చేసుకోవాలి
ఓటర్లు తమ ఓటు హక్కును పారదర్శకంగా నిర్వర్తించేందుకు ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం చేసుకోవాలి. 245 మంది బీఎల్వోలు ఇంటి వద్దకే వస్తున్నారు. వారికి సహకరించి గరుడా యాప్లో నమోదు చేసుకోవాలి. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో స్వచ్ఛందంగా చేసుకోవాలి.
-రజనీకాంత్ రెడ్డి,ఎన్నికల రిటర్నింగ్ అధికారి