కొండాపూర్, నవంబర్ 20 : ట్రాఫిక్ సమస్యను, ప్రమాదాలను నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు వాహనదారుల్లో ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. సిగ్నల్స్ వద్ద వాహనాలను ఇష్టానుసారంగా నిలుపుతూ ఇతర వైపుల నుంచి వచ్చే వారికి, పాదచారులకు ఇబ్బందులు కలిగించేలా నిలుపుతున్న వాహనదారులపై కొరడా ఝళిపిస్తున్నారు. సిగ్నల్ స్టాప్లైన్ దాటి ముందుకు వచ్చే వాహనదారులపై భారీగా ఫైన్లను విదిస్తూ తప్పును అర్ధమయ్యేలా వివరిస్తున్నారు. కూడళ్ల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పీకర్ల సహాయంతో రోడ్డు భద్రత నియమాలపై ఎప్పటికప్పుడు వాహనదారుల్లో అవగాహన కల్పిస్తున్నారు. దీంతో పాటుగా ట్రాఫిక్ పోలీసులు వాహనదారుల భద్రత కోసం తీసుకువస్తున్న కొత్త చట్టాలను తెలియపరుస్తున్నారు. వాహనదారుల భద్రత, సాఫీ ప్రయాణాలు సాగించేలా ట్రాఫిక్ పోలీసులు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నారు. వాహనదారులు రోడ్డు నియమాలను పాటిస్తూ ముందుకు సాగితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవంటున్నారు ట్రాఫిక్ పోలీసులు.
స్టాప్లైన్ క్రాస్ చేయడంతోనే ఇబ్బందులు
అందరికంటే ముందుగా వెళ్ళాలనే ఆలోచనతోనే స్టాప్ లైన్ క్రాస్ చేస్తున్నారు. దీంతో ఇతర వైపుల నుంచే వచ్చే వాహనదారులకు, రోడ్డు క్రాస్ చేసే పాదాచారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుంది. ఒక్కోసారి ఏ వాహనదారుడు ఎటువైపు వెళ్తున్నాడో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంటుంది. స్టాప్లైన్ క్రాస్ చేస్తే ఫైన్ వేస్తుండడంతో వాహనదారుల్లో భయం పెరిగింది. దీంతో గీత దాటేందుకు భయపడుతున్నారు.
– నవీన్, ప్రయాణికుడు
కూడళ్ల వద్ద అవగాహన కల్పిస్తున్నాం..
మాదాపూర్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలోని అన్ని కూడళ్లలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పిస్తున్నారు. చెబుతున్న వినకుండా ఇతరులకు ఇబ్బందులు కలిగించే వాహనదారులపై ఫైన్లు విధిస్తున్నాము. స్టాప్ లైన్ క్రాస్ చేసే వారిపై ప్రత్యేక నజర్ పెడుతున్నాము. వాహనదారుల భద్రత ట్రాఫిక్ పోలీసుల ప్రధమ కర్తవ్యం.
– నర్సయ్య, మాదాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్