మన్సూరాబాద్, నవంబర్ 20: కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి మారినందుకు ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని లక్ష మంది ప్రజలకు న్యాయం జరిగిందని.. ఏండ్ల తరబడిగా నెలకొన్న రిజిస్ట్రేషన్లు, యూఎల్సీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. యూఎల్సీ సమస్యను పరిష్కరించడాన్ని హర్షిస్తూ మన్సూరాబాద్ డివిజన్ పరిధి సహారాస్టేట్స్కాలనీ సమీపంలోని ఎస్వీ కన్వెన్షన్ హాల్లో ఆదివారం మాజీ వార్డు కమిటీ సభ్యుడు దుర్గెంపూడి సాంబిరెడ్డి, శ్రీరామహిల్స్కాలనీ అధ్యక్షుడు మొద్దు నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో శ్రీబాలాజీనగర్, శ్రీరామహిల్స్కాలనీ, వివేకానందనగర్, రాగాల ఎన్క్లేవ్, పద్మావతినగర్ కాలనీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి మాట్లాడుతూ.. కొందరు అధికారులు చేసిన తప్పిదంతో ఎల్బీనగర్ నియోజకవర్గంలో యూఎల్సీ, రిజిస్ట్రేషన్ల సమస్యలు తలెత్తాయని తెలిపారు. సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎల్బీనగర్పై ప్రత్యేక దృష్టిసారించి యూఎల్సీ, రిజిస్ట్రేషన్ల సమస్యకు పరిష్కారం చూపారని తెలిపారు. జీఓ నం.118తో ఎల్బీనగర్ నియోజకవర్గంలోని 46 కాలనీల ప్రజలకు యూఎల్సీ, రిజిస్ట్రేషన్ల సమస్య నుంచి విముక్తి లభించిందని తెలిపారు. ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేనిఫెస్టోలో తాను ఇచ్చిన ప్రధాన హామీలైన ప్రాపర్టీ ట్యాక్సు తగ్గింపు, రిజిస్టేషన్లు, యూఎల్సీ సమస్య, కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ తరలింపు, చెరువుల సుందరీకరణ పనులను ఇప్పటికే పూర్తి చేశానని తెలిపారు. ఆటోనగర్ డంపింగ్ యార్డును ప్రక్షాళన త్వరలో చేపడుతానని తెలిపారు. కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ స్థలంలో అత్యాధునిక హంగులతో అన్ని విభాగాలతో కలిపి ప్రజల కోసం వెయ్యి పడకల దవాఖానను నూతనంగా ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ ఇప్పటికే శంకుస్థాపన చేశారని తెలిపారు. కామినేని చౌరస్తా నుంచి సుష్మామార్గంలో రోడ్డు వెడల్పు పనుల కోసం ప్రజలు రెఫరండం నిర్వహించుకోవాలని.. 100 ఫీట్లు లేదా 120 ఫీట్ల రోడ్డు వెడల్పు చేపట్టాల అనేది తేల్చుకోవాలని కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులకు ఆయన సూచనలు చేశారు.
ఎంపీ కనపడక 22 నెలలయ్యింది
మల్కాజిగిరి పార్లమెంటు నుంచి పోటీ చేసి గెలిచిన ఎంపీ ఎల్బీనగర్ నియోజకవర్గంలో 2021 జనవరిలో పర్యటించాడని.. ఇప్పటికీ ఆయన జాడ తెలియక 22 నెలలు అవుతుందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. నెలల తరబడిగా ప్రజల ముఖం చూడని ప్రజా ప్రతినిధి సమస్యలను ఎలా పరిష్కరిస్తాడని విమర్శించారు. నియోజకవర్గానికి రాని ప్రజా ప్రతినిధులను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంపీ, కార్పొరేటర్లు బాధ్యత తీసుకోవాలని సూచించారు. బాధ్యతలు తీసుకోకపోగా తాను చేపడుతున్న అభివృద్ధి పనులకు అడ్డు పడుతూ కొత్త సమస్యలను సృష్టిస్తున్నారని తెలిపారు.
కుల మతాలకు అతీతంగా..
కుల మతాలకు అతీతంగా పండుగలు నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. రాజీవ్గాంధీనగర్లో యాసిన్, రఫీక్, ముకారాం, జహీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్యార్వీ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆయన వెంట కొత్తపేట మాజీ కార్పొరేటర్ జీవీ సాగర్రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు లింగాల రాహుల్గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ విశ్వేశ్వర్రావు, రాగిరి ఉదయ్ గౌడ్, హనీఫ్, రఫీక్, సయ్యద్, అబ్రార్, వాజిద్, జహంగిర్, నాయకులు జోగు రాములు, రమావత్ దీల్లాల్, మల్లెపాక యాదగిరి, వెంకట్రెడ్డి, నాగేశ్, ఇటిక్యాల యాదగిరి, జహంగిర్ బాబా గౌడ్, ఏర్పుల గాలయ్య, బాలాజీ గైక్వాడ్ పాల్గొన్నారు.