సిటీబ్యూరో, నవంబర్ 14 ; కంటోన్మెంట్లో అడుగడుగునా విధిస్తున్న ఆంక్షలతో స్థానికులు విసిగిపోతున్నారు. ఈ ప్రాంతం కేంద్రం ఆధీనంలో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఏ అభివృద్ధి పనులు చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టారు. స్థానికులను భాగస్వాములను చేసి.. పోస్టు కార్డు ఉద్యమాన్ని చేపట్టారు. సమస్యల పరిష్కారానికి ప్రజలు రాసిన 10వేల లేఖలు, 2వేల పోస్టు కార్డులతో పాటు మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద్, సాయన్న, మైనంపల్లి హన్మంతరావు, బేతి సుభాష్రెడ్డి ఇచ్చిన లేఖలను మర్రి రాజశేఖర్రెడ్డి సోమవారం కంటోన్మెంట్ సీఈవోకు అందజేశారు.
కంటోన్మెంట్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నప్పటికీ ఈ ప్రాంత అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి కేంద్రం చొరవ చూపడం లేదన్న విమర్శ ఈ ప్రాంత ప్రజల్లో ఉంది. కంటోన్మెంట్ బోర్డు వార్షిక బడ్జెట్లో కేటాయిస్తున్న అరకొర నిధులు..ఇక్కడి మౌలిక వసతులుల కల్పన, ఇతర అవసరాలకు ఏ మూలకు సరిపోని పరిస్థితి. పూర్తిగా వెనుకబడ్డ ఈ ప్రాంత అభివృద్ధిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక ఫోకస్ పెట్టినప్పటికీ ..అడుగడుగునా కేంద్రం ఆంక్షల కారణంగా క్లిష్టమైన పరిస్థితి నెలకొంది. ఈ ప్రాంతంలో తరచుగా రోడ్లను మూసివేస్తుండడం, గాంధీ కమ్యూనిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును తొలగించకపోవడంతో కంటోన్మెంట్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యలు పరిష్కరించాలన్న స్థానికుల డిమాండ్ను కంటోన్మెంట్ అధికారులు పెడచెవిన పెట్టడంతో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు స్థానికులతో కలిసి వినూత్న రీతిలో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
పోస్టు కార్డులతో ఉద్యమం..
కంటోన్మెంట్ సమస్యల పరిష్కారానికి మాల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్థానికులను భాగస్వామ్యులను చేసి పోస్టు కార్డు ఉద్యమాన్ని చేపట్టారు. పోస్టు కార్డులు, లేఖల ద్వారా కంటోన్మెంట్ అధికారుల కండ్లు తెరిపిద్దామని పిలుపునిచ్చారు. ఈ మేరకు పెద్ద ఎత్తున స్థానికులు లేఖలు, పోస్టుకార్డులను రాశారు. దీనితోపాటు మంత్రి మల్లారెడ్డిని, కత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిలను కలిసి కంటోన్మెంట్ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు.
సమస్యను పరిష్కరించాలని వారు ఇచ్చిన లేఖలతోపాటు ప్రజల నుంచి సేకరించిన పదివేల లేఖలు, రెండు వేల పోస్టు కార్డులను 150 వెల్ఫేర్ అసోసియేషన్ సంఘాల ప్రతినిధులు, మాజీ బోర్డు సభ్యులతో కలిసి మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి సోమవారం కంటోన్మెంట్ సీఈవోకు అందజేశారు. ఇప్పటికైనా సమస్యలను పరిష్కరించకుంటే రాబోవు రోజుల్లో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, బోర్డ్ మాజీ సభ్యుడు పాండు యాదవ్, శ్యామ్, నళిని కిరణ్, పెద్దల నర్సింహ్మ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.