మెహిదీపట్నం, అక్టోబర్ 22: ముంబై, పుణె నుంచి తీసుకువస్తూ నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురిని హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్- ఎన్ఈడబ్ల్యూ) పట్టుకుంది. వారి వద్ద నుంచి ఎండీఎం 30 గ్రాములు, కొకైన్ 40 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ మండలం డీసీపీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం డీసీపీ జోయల్ డెవిస్, హెచ్- ఎన్ఈడబ్యు డీసీపీ చక్రవర్తి గుమ్మి, ఇన్స్పెక్టర్లు రాజేశ్, ఎన్.వెంకటేశ్వర్లు కలిసి వివరాలను వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం నిఘా పెట్టిన పోలీసులు శనివారం ఉదయం గోల్కొండ రాందేవ్గూడ ప్రాంతంలో ఉత్తర్ప్రదేశ్ గోరఖ్పూర్కు చెందిన మహ్మద్ అలీం ఖాన్ (27)ను అరెస్టు చేశారు. బట్టల వ్యాపారం చేస్తున్న నిందితుడు తరచూ హైదరాబాద్కు వస్తుంటాడు. ఇటీవల డ్రగ్స్ దందాను కూడా మొదలు పెట్టాడు. ముంబై, పుణె నుంచి డ్రగ్స్ను హైదరాబాద్కు తీసుకువస్తున్న నిందితుడు అవసరమైన వ్యక్తులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు. అతడి వద్ద నుంచి 30 గ్రాముల ఎండీఎం, మొబైల్ ఫోన్, 3,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా అతడి వద్ద నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న 11 మంది వివరాలను కూడా పోలీసులు సేకరించినట్లు డీసీపీ జోయల్ డెవిస్ తెలిపారు.
పంజాగుట్టలో నైజీరియన్తో పాటు..
పంజాగుట్టలో అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న ఓ నైజీరియన్తో పాటు మరో ఇద్దరిని హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, పంజాగుట్ట పోలీసులు పట్టుకున్నారు. వారిని నైజీరియాకు చెందిన మహ్మద్ తొయిరు బాకరి(35), ముంబైకి చెందిన అపూర్వ మాతా ప్రసాద్ ఉపాధ్యాయ(41), అజయ్కుమార్ చౌపల్ (18)గా గుర్తించారు. వీరింతా పాత నేరస్తులు. హైదరాబాద్కు శనివారం డ్రగ్స్ తీసుకొని వచ్చిన అపూర్వ మాతా ప్రసాద్ ఉపాధ్యాయ, అజయ్ చౌపల్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. తొయిరు బాకరి వివరాలు చెప్పారు. పోలీసులు వలపన్ని అతడిని కూడా పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 40 గ్రాముల కొకైన్, 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసున్నారు. వారి కస్టమర్ల వివరాలను కూడా పోలీసులు సేకరించారు. గతంలో పంజాగుట్ట పీఎస్లో నమోదైన కేసులో నైజీరియన్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. నగరంలో ఎవరైనా.. ఎక్కడైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా.. వినియోగిస్తున్న వారి సమాచారాన్ని 8712661601 నంబర్కు కాల్ అందించాలని పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్ కోరారు.