వెంగళరావునగర్, అక్టోబర్ 16: కొండపై ఏర్పాటు చేసిన సువిశాలమైన క్రీడా మైదానంలో మహానగరాన్ని వీక్షిస్తూ.. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆటలాడుతూ సంబురపడిపోతున్నారు క్రీడాకారులు. టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రత్యేక చొరవతో రహ్మత్నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్లోని క్వారీ గుంతలను పూడ్చి క్రీడా మైదానాన్ని నిర్మించారు.
నాడు అసాంఘిక శక్తులకు అడ్డా
నాడు ఈ ప్రాంతం నిరుపయోగంగా.., నిర్మానుష్యంగా.., అసాంఘిక శక్తులకు అడ్డాగా ఉండేది. చీకటి పడిందంటే అటువైపు వెళ్లడానికే స్థానికులు జంకేవారు. కానీ ఇప్పుడు రూపురేఖలు మారిపోయాయి. భవన నిర్మాణ వ్యర్థాలతో క్వారీ గుంతలను పూడ్చేసి సువిశాలమైన క్రీడా మైదానం ఏర్పాటు చేశారు.
నాలుగు ఎకరాల విస్తీర్ణంలో..
అతి ఎత్తైన కొండపై తొమ్మిది ఎకరాల స్థలం ఉండగా.. నాలుగు ఎకరాల్లో ఈ క్రీడా మైదానం ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి నగర అందాలను వీక్షిస్తూ.. మరింత ఉత్సాహంతో క్రీడల్లో పాల్గొంటున్నారు. మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నాకౌట్ క్రికెట్ మ్యాచ్లను సైతం ఇక్కడే నిర్వహించారు.
త్వరలో ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేస్తాం
రాబోయే తరాలు కూడా గుర్తుంచుకునేలా ఓ మంచి పని చేయగలిగాననే సంతృప్తి ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో క్రీడాకారులకు సరైన ఆటస్థలం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడేవారు. వారి ఇబ్బందులను గుర్తించి ఎస్పీఆర్ హిల్స్ కొండపై క్రీడా మైదానం ఏర్పాటు చేశాం. ఇక్కడ క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో వంటి క్రీడలు ఆడుకోవచ్చు. పగలే కాకుండా రాత్రి వేళల్లో కూడా ఆటలాడుకునే విధంగా త్వరలో ఇక్కడ ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేస్తాం.
– మాగంటి గోపీనాథ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే
క్రీడా రత్నాలను వెలికితీయడానికి ఆస్కారం
క్రీడా రత్నాలను వెలికితీయడానికి ఆస్కారం లభించింది. క్రీడాకారులకు సరైన స్థలంలేక ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఆ సమస్య తీరింది. భవిష్యత్తులో ఈ క్రీడా మైదానం నుంచి క్రీడా రత్నాలను తయారు చేయవచ్చు. క్రీడాకారుల కోసం ఇంత చక్కని మైదానం ఏర్పాటు చేయించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు కృతజ్ఞతలు.
– హరీశ్ గౌడ్, స్థానికుడు