సిటీబ్యూరో, అక్టోబర్ 16(నమస్తే తెలంగాణ): ఒకప్పుడు చుక్క నీరు లేక జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్ తల్లడిల్లేవి. ప్రస్తుతం ఎడతెరపి లేకుండా పడుతున్న వానలతో సీన్ మారింది. గడిచిన నెల రోజులుగా భారీ వానలు.. వరద నీటితో నిండు కుండలను తలపిస్తున్నాయి. 15ఏండ్ల తర్వాత.. 15 రోజులుగా రిజర్వాయర్ల నుంచి నీటిని మూసీలోకి విడుదల చేస్తూనే ఉన్నారు.
జంట జలాశయాల నుంచి 15 రోజులుగా ఆగకుండా నీటి విడుదల కొనసాగుతూనే ఉంది. 15 ఏండ్ల తర్వాత తొలిసారిగా ఈ తరహా నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. యేటా వానకాలంలో మాత్రమే మూడు రోజులకు మించి జలాశయాల నుంచి నీటిని విడుదల చేయలేదు. 2018-19లో ఏకంగా నీరు లేక ఎండిపోయింది. వందేండ్ల తర్వాత 2020లో మహానగరంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఐదు రోజులు మాత్రమే నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం వర్షకాలం మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు సగటున 300 క్యూసెక్కుల వరద నీరు చేరుతూనే ఉంది. సెప్టెంబర్ 28 నుంచి ఇప్పటివరకు రెండు జలాశయాల గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు.
క్యాచ్మెంట్ ఏరియాలో నిండిన చెరువులు
18 మండలాల పరిధిలో విస్తరించి ఉన్న ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ రిజర్వాయర్ల క్యాచ్మెంట్ ఏరియాల్లో ఉన్న చెరువులు, కుంటలు అన్ని గత ఏడాది నుంచి నిండి ఉన్నాయి. ఈసారి సీజన్ ప్రారంభం నుంచే కుండపోత వానలతో వరద నీరు నిల్వ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో రెండు రిజర్వాయర్లకు క్యాచ్మెంట్ ఏరియాల నుంచి వరద నీరు చేరుతూనే ఉందని అధికారులు చెబుతున్నారు.
ఏడాది పొడవునా తగ్గని నీటి మట్టం
ఉస్మాన్సాగర్ ఫుల్ ట్యాంక్ లెవల్ 3.9 టీఎంసీలు, హిమాయత్ సాగర్ 2.9 టీఎంసీలు. ప్రస్తుతం రెండు జలాశయాలు ఫుల్ ట్యాంక్ లెవల్లోనే కొనసాగుతున్నాయి. ఉస్మాన్సాగర్లో ప్రస్తుతం 3.785 టీఎంసీల నీరు ఉండగా, 4గేట్లను ఎత్తి 1700 క్యూసెక్కుల, హిమాయత్సాగర్లో 2.784 టీఎంసీల నీరు ఉండగా, రెండు గేట్లను ఎత్తి 695 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.