కీసర, అక్టోబర్ 12 : రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి గిడ్డంగిల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నది. దీంతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేసి రైతు పక్షపాతిగా నిలుస్తున్నాడు. కీసర మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘంలో గిడ్డంగిని నిర్మించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ గిడ్డంగి భవనానికి నాబార్డు నిధుల నుంచి రూ.1.50కోట్లను కేటాయించింది. ఆ పనులకు గత జూన్ నెల రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి చేతులమీదుగా ముహూర్తం చేయగా.. గిడ్డంగికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బేస్మెంట్ స్థాయిని పూర్తి చేశారు. దాని మీద ఒక్క కప్ స్లాబ్ కూడా వేశారు. ఇక దాని మీద ఇనుప రాడ్స్తో భారీ షెడ్ నిర్మాణం చేసి గోదాంను నిర్మించనున్నారు.
పనులను త్వరితగతిన పూర్తి చేస్తాం
కీసరల్లో మంత్రి మల్లారెడ్డి ప్రత్యేక చొరవతో గిడ్డంగిని ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఉన్నది. ఈ గిడ్డంగి నిర్మాణానికి నాబార్డు ద్వారా నిధులు వచ్చాయి. ఆ నిధులతో త్వరితగతిన నిర్మించి రైతులకు అందుబాటులోకి తీసుకొస్తాం. కీసర సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు దీర్ఘకాలిక రుణాలతోపాటు పలు రకాల రుణాలను అందించి అందుబాటులో ఉంటున్నాం. గిడ్డంగిలు ఉంటే రైతులు పండించిన పంటలను నిలువ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
– వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రామిడి ప్రభాకర్రెడ్డి