సిటీ బ్యూరో, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : ఆస్తిపన్ను బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఇచ్చిన వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) అవకాశం ఈ నెలాఖరుతో ముగుస్తున్నది. 2021-22 సంవత్సరం వరకు చెల్లించాల్సిన ఆస్తిపన్ను బకాయిల మొత్తాన్ని కేవలం 10 శాతం వడ్డీతో ఏకకాలంలో చెల్లించి, వడ్డీపై 90 శాతం మాఫీని పొందే అవకాశం ప్రభుత్వం కల్పించింది. ఇప్పటి వరకు 37,941 మంది మాత్రమే సద్వినియోగం చేసుకున్నారు. జీహెచ్ఎంసీకి ఓటీఎస్ రూపంలో రూ.72.60కోట్ల ఆదాయం సమకూరింది. వాస్తవంగా ఓటీఎస్తో రూ. 300కోట్ల మేర రావొచ్చని జీహెచ్ఎంసీ అంచనా వేసింది. కాగా, వరుసగా పండుగలు రావడం, దాదాపు సిబ్బంది డబుల్ బెడ్ర్రూం ఇండ్ల దరఖాస్తుల పరిశీలనపై దృష్టి సారించడం ఫలితంగా ఓటీఎస్ వసూళ్లు ఆశించిన స్థాయిలో కాలేదు. దీంతో సర్కిళ్ల వారీగా బిల్ కలెక్టర్లు, టాక్స్ ఇన్స్పెక్టర్లు, ఏఎంసీలు లక్ష్యంతో ముందుకు సాగాలని కమిషనర్ ఆదేశించారు. దీంతో క్షేత్రస్థాయిలో ఓటీఎస్ సద్వినియోగంపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ 18 రోజుల్లో మరో వంద కోట్ల మేర రాబడే లక్ష్యంగా వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.