సిటీబ్యూరో, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): సరైన పార్కింగ్ సౌకర్యం లేని వాణిజ్య సముదాయాలు వెంటనే పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని, పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోకుండా ట్రాఫిక్ రద్దీకి కారకులయ్యే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని రాచకొండ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. రోడ్లపై ట్రాఫిక్ జామ్ చేసి, సామాన్య పౌరులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన రామంతాపూర్లోని లాండ్ మార్క్ హోటల్పై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యిందని డీసీపీ వివరించారు. ఆదివారం సాయంత్రం రామంతాపూర్లో ల్యాండ్ మార్క్ హోటల్ ప్రారంభోత్సవానికి సినీ నటులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ రద్దీ ఏర్పడి, సామాన్య వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులకు చాలా సమయం పట్టింది. అయితే, ట్రాఫిక్ పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని, సామాజిక బాధ్యత లేకుండా ఆ మార్గంలో వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు కలిగించే విధంగా హోటల్ యజమాన్యం వ్యవహరించిందని డీసీపీ తెలిపారు. కనీస పార్కింగ్ సౌకర్యలు లేకుండా ప్రారంభోత్సవం చేయడంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడి.. ప్రజలు ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. ఈ విషయంపై ఉప్పల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదయ్యిందని ట్రాఫిక్ డీసీపీ వెల్లడించారు. అలాగే, ఉప్పల్లోని ఓ హోటల్ కూడా సరైన పార్కింగ్ స్థలం లేకుండా కాలనీ వాసులకు ఇబ్బందులు కలిగిస్తుండటంతో నోటీసులు జారీ చేశామన్నారు. యాజమాన్యం స్పందించకపోవడంతో సరైన పార్కింగ్ స్థలం లేకుండా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ఆ హోటల్ అనుమతి రద్దు చేయాలని జీహెచ్ఎంసీకి లేఖ రాసినట్లు డీసీపీ వివరించారు. వాణిజ్య సముదాయాలు తమ వ్యాపారాల నిర్వహణ కోసం సరైన పార్కింగ్ సౌకర్యాన్ని కలిగి ఉండాలని డీసీపీ సూచించారు. ఆయా సముదాయాల వద్దకు వచ్చే ప్రజలు తమ వాహనాలను సరైన పార్కింగ్ స్థలాల్లో నిలిపే విధంగా ఆయా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని సూచించారు.