బంజారాహిల్స్/ఖైరతాబాద్/హిమాయత్నగర్,అక్టోబర్ 9: మహ్మద్ ప్రవక్త బోధనల సారాన్ని అర్థం చేసుకుని శాంతి, సామరస్యాన్ని కాపాడేందుకు పాటు పడాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్బంగా ముస్లింలు జరుపుకునే మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం బంజారాహిల్స్ రోడ్ నం.7లోని మసీదువద్ద ఏర్పాటు చేసిన శాంతి ర్యాలీని ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రపంచంలోని అన్ని మతాల సారం ఒక్కటే అని, సాటివారి కష్టాలను అర్థం చేసుకుని సాయం చేయడంతో పాటు శాంతిని కాపాడడమే అన్నారు. అ నంతరం బంజారాహిల్స్, వెంకటేశ్వరకాలనీ, జూబ్లీహిల్స్ పరిదిలో శాంతి ర్యాలీలు కొనసాగాయి.
అదేవిధంగా ఖైరతాబాద్ డివిజన్లోని ఎంఎస్మక్తా ఈద్గా మైదానం వద్ద మిలాద్-ఉన్-నబీ సందర్భంగా హోం మంత్రి మహమూద్అలీ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
పోలీసుల పటిష్ట బందోబస్తు ..
మిలాద్-ఉన్-నబీని పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. శాంతీ ర్యాలీల సందర్భంగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడకుండా బంజారాహిల్స్. జూబ్లీహిల్స్ పోలీసులు చర్యలు తీసుకునాన్నారు. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ నరేందర్, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
హిమాయత్నగర్లో.. మహ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా నిర్వహించే మిలాద్-ఉన్-నబీ వేడుకలను ఆదివారం హిమాయత్నగర్ డివిజన్లో ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపు కున్నారు. మసీద్లలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, అన్నదానం, పండ్లు పంపిణీ చేశారు. ముస్లిం యువకులు జెండాలను పట్టుకుని బైక్ ర్యాలీలు నిర్వహిం చారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొని ముస్లింలకు మిలాద్-ఉన్-నబీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.