పహాడీషరీఫ్, అక్టోబర్ 9: హబీబ్, సైఫ్, అలైన్ కాలనీలకు మహర్దశ పట్టింది. ఎన్నో ఏండ్లుగా ఉన్న డ్రైనేజీ, రోడ్డు సమస్య తీరింది. దీంతో ఆయా కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి చొరవతో గత ఏడాది రూ.12 లక్షలతో హబీబ్కాలనీలో డ్రైనేజీ, సీసీ రోడ్డు, ఇటీవల రూ.50 లక్షలతో సైఫ్ కాలనీలో, రూ. 65 లక్షలతో అలైన్ కాలనీలో సీసీ రోడ్లు అభివృద్ధి చేశారు. ఎన్నో ఏండ్లుగా అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ, గుంతలమయంగా ఉన్న రోడ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కాలనీల్లో దశల వారీగా డ్రైనేజీ, సీసీ రోడ్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని హబీబ్కాలనీ, సైఫ్, అలైన్ కాలనీ వాసులు చెబుతున్నారు. ఇంతకాలానికి రహదారుల కష్టాలు తీరాయని కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మా కాలనీకి అందం వచ్చింది..
ఇంత కాలం సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో రోడ్డు మార్గాలు అధ్వానంగా తయారయ్యాయి. రోడ్లపై రాళ్లు తేలి, ఎగుడు దిగుడుగా మారాయి. అత్యవసర పరిస్థితిలో ఇంటి నుంచి బయటికి వెళ్లాలంటే ఎంతో భయపడేవాళ్లం. ద్విచక్ర వాహనదారులు అదపుతప్పి కింద పడిపోయేవారు. డ్రైనేజీ, సీసీ రోడ్డు అభివృద్ధితో కాలనీకి అందం వచ్చింది. కాలనీ, బస్తీల్లో మౌలిక సదుపాయాలు సమకూరుతున్నాయి.
– షేక్ మునీర్, అలైన్ కాలనీ
దశలవారీగా అభివృద్ధి పనులు
మున్సిపల్ పరిధిలోని కాలనీలు, బస్తీల్లో మౌలిక వసతులు దశల వారీగా సమకూర్చడానికి నిరంతరం కృషి చేస్తున్నాను. మున్సిపల్ పరిధిలో అత్యవసరం ఉన్న ప్రాంతాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో డ్రైనేజీ, సీసీ రోడ్డు అభివృద్ధి పనుల చేపడుతున్నాం. ప్రతి కాలనీ, బస్తీల్లో మౌలిక వసతులు సమకూరేలా చర్యలు తీసుకుంటున్నాను. గడిచిన మూడు నెలల కాలంలో రూ.20 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టాం. జరుగుతున్న పనులను త్వరగా పూర్తి చేయాలని డీఈ, ఏఈకి ఆదేశాలు జారీ చేశారు.
– చైర్మన్ అబ్దుల్లా సాది, జల్పల్లి మున్సిపాలిటీ