సిటీబ్యూరో, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సీఎం కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని ఏర్పాటు చేయడంతో నెటిజన్లు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. బుధవారం సోషల్ మీడియాలో ‘కేసీఆర్ ఫర్ ఇండియా’.. ‘వచ్చాడు కేసీఆర్.. అవుతాడు ప్రధాని’ అంటూ ట్విట్టర్లో మోత మోగిస్తున్నారు. అవినీతిలో కూరుకుపోయిన బీజేపీ, కాంగ్రెస్లకు తగిన బుద్ధి చెప్పే పార్టీ ఒక్క బీఆర్ఎస్సేనని ఫేస్బుక్, ట్విట్టర్, వ్యాట్సాప్లో సందేశాలు పెట్టి వైరల్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేసీఆర్ అభిమానులు బీఆర్ఎస్కు మద్దతు ప్రకటిస్తూనే.. దేశంలో తెలంగాణ పథకాలు అమలు చేస్తే ప్రతిఒక్కరూ సుఖసంతోషాలతో ఉంటారని పోస్టులు పెడుతున్నారు.
దసరా రోజు బీజేపీకి నిద్ర కరువైయిందని కమలం నేతలపై సెటైర్లు వేస్తూ ఓ ఆట ఆడుకుంటున్నారు. ప్రజలను సమస్యల వలయంలో నెట్టేసి దేశ ఆస్తులను అమ్మేస్తున్న బీజేపీపై ఉక్కుపాదం మోపడానికి వస్తున్నాడు కేసీఆర్ అంటూ భిన్న రకాల మీమ్స్ రూపొందిస్తూ షేర్ చేస్తున్నారు. జాతీయపార్టీపై విమర్శలు చేస్తున్న నాయకుల గత చరిత్రను ప్రస్తావిస్తూ వారిపై కూడా మీమ్స్తో చెక్ పెడుతున్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలోనూ అనేక విమర్శలు చేశారని.. వాటన్నింటికి కాలానుగుణంగా జవాబులు చెబుతూ రాష్ర్టాన్ని సాధించిన ఘనత కేసీఆర్ది అని పోస్టులు పెడుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు నెటిజన్లు. మరోవైపు ట్విట్టర్లో బీఆర్ఎస్ ఇండియా ఎట్ ది రేట్ బీఆర్ఎస్ 4భారత్ పేరుతో అకౌంట్ను ప్రారంభించింది.