మేడ్చల్, అక్టోబర్ 5(నమస్తే తెలంగాణ) :చరిత్రలో లేనివిధంగా తెలంగాణ ఉద్యమం చేపట్టి తెలంగాణ రాష్ట్రం సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్తోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని దేశంలోని ప్రజలందరూ భావిస్తున్నారు. దేశ రాజకీయాల్లోకి రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను దేశ ప్రజలు స్వాగతిస్తున్నారు. తెలంగాణ సాధించాలన్న పట్టుదలతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ పది జిల్లాల్లో పర్యటించి ప్రజల మద్దతు కూడగట్టుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.
అప్పట్లో కేసీఆర్ ప్రారంభించిన ఉద్యమాన్ని తెలికగా తీసుకున్న వివిధ పార్టీలు ఆయన నడిపించిన ఉద్యమ తీవ్రతను చూసి తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇయ్యాల్సిన పరిస్థితిని తీసుకువచ్చారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రగతిని చూసి ఇతర రాష్ర్టాల ప్రజలు అబ్బుర పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత చేపట్టిన అభివృద్ధి, సంక్షేమంతో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఇక్కడ అమలవుతున్న పథకాలు దేశంలోని వివిధ రాష్ర్టాల ప్రజలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉన్న అనుభవం దృష్ట్యా దేశ రాజకీయాల్లోకి వస్తే దేశాభివృద్ధి జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ సాధించిన విధంగానే దేశాభివృద్ధి సాధించే వరకు పట్టుదలతో పనిచేస్తారన్న విశ్వాసం ప్రజల్లో ఏర్పడింది.
ఆచరణవాది కేసీఆర్
అనుకున్నది ఆచరణలో పెట్టే ఆచరణవాది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆమరణ దీక్ష చేసి తెలంగాణ కలను సాకారం చేసిన గొప్ప నేత. శాంతి, అహింస మార్గాల్లో పయనిస్తున్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఖచ్చితంగా తనదైన ముద్ర వేస్తారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమం, అభివృద్ధి నమూనా ఒక్క తెలంగాణకే పరిమితం కావొద్దనేది కేసీఆర్ ఆలోచన. ఆ గరుతర బాధ్యత కేసీఆర్పైనే ఉన్నదని ప్రజల విశ్వాసం. ఆ విశ్వాసమే కేసీఆర్ను దేశ రాజకీయాల్లో నిలబెడుతుంది. తెలంగాణ లెక్కనే కేసీఆర్ ఆధ్వర్యంలో దేశం అభివృద్ధి చెందాలని ఒక పౌరుడిగా, అభ్యుదయవాదిగా, రచయితగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ.. ఆహ్వానిస్తున్నా.
– చిలివేరు రఘురాం, విశ్రాంత ఉద్యోగి-మలిదశ తెలంగాణ యజ్ఞం నాటక రచయిత
నవ భారతానికి కేసీఆర్ నాయకత్వం అవసరం
నవ భారతానికి కేసీఆర్ లాంటి నిజాయతీ కలిగిన నాయకత్వం అవసరం. కేసీఆర్ ఒక ఆలోచనను తలిచారంటే.. సాధించి తీరుతారు. దేశ రాజకీయాల్లో కూడా తన ఉద్యమ పటిమతో కూడిన స్ఫూర్తిని కలిగి ఉంటారు. అధికార వికేంద్రీకరణలో భాగంగా 33జిల్లాలను ఏర్పాటు చేశారు. కేసీఆర్ దూరదృష్టితో పాటు అకుంటిత దీక్షతో అభివృద్ధిలో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్నది. 2001లో టీఆర్ఎస్ మనుగడ సాగిస్తుందా? అనే సందేహం ఉండేది. సందేహాలను పటాపంచలు చేస్తూ.. బక్కపలుచని నేతే.. బలీయమైన గులాబీ దళాన్ని ఏర్పాటు చేసి రాష్ర్టాన్ని సాధించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఖచ్చితమైన విజయం సాధిస్తారని ఆశిస్తున్న.
– కొండపల్లి నిహారిని, ప్రముఖ రచయిత్రి