సిటీబ్యూరో, అక్టోబర్ 5(నమస్తే తెలంగాణ) :2001 మార్చిలో ఉద్యమ నాయకుడు కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాంది పలికిన రోజు నుంచి టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి ఆయన వెన్నంటే ఉంటూ, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని మారుస్తూ.. బీఆర్ఎస్(భారత్ రాష్ట్ర సమితి)గా నామకరణం చేసిన సందర్భంగా శోభన్ రెడ్డి ‘నమస్తే తెలంగాణ’తో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆయన మాటల్లోనే.. 2001 ఏప్రిల్ 27వ తేదీన టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ప్రతి కార్యక్రమాన్ని కేసీఆర్ ఆదేశాలతోనే విజయవంతం చేశాం. పార్టీ స్థాపించక ముందు నుంచే కేసీఆర్ వెన్నంటే ఉన్నా.. తెలంగాణ రాష్ట్ర సమితి పురుడు పోసుకున్న అనంతరం వెయ్యి మందితో పార్టీలో చేరుతానని కేసీఆర్కు మాటిచ్చి 2001 మే 3వ తేదీన జలదృశ్యానికి భారీ కాన్వాయ్తో సుమారు 1500 మందితో ర్యాలీగా చేరుకునే సమయానికి కేసీఆర్ ముందుకు వచ్చి అలింగనం చేసుకోవడం ఇప్పటికీ మర్చిపోలేను. ఆనాటి నుంచి కేసీఆర్ వెంటే నా పయనాన్ని కొనసాగించాను.
ఉద్యమానికి శ్రీకారం చుట్టే క్రమంలో నగరంలోనే మొట్టమొదటి టీఆర్ఎస్ పార్టీ జెండా దిమ్మెను తార్నాకలో కట్టించి, కేసీఆర్తో ఆవిష్కరింపజేశాను. 22ఏండ్లుగా సీఎం కేసీఆర్ను చాలా దగ్గరినుంచి చూశాను. ఉద్యమం నాటి నుంచి ఒక విజన్తోనే ముందుకు సాగారు. కేసీఆర్కు ఒక తెలంగాణ ప్రాంతంలోనే కాదు.. దేశంలోని ఇతర రాష్ట్రాల పరిస్థితులపై అవగాహన ఉంది. అసాధ్యం అన్న వ్యవసాయరంగాన్ని సుసాధ్యం చేసి చూపిన రైతుల పక్షపాతి కేసీఆర్. ఆయన జాతీయ రాజకీయాల్లో ఉంటే తెలంగాణకు కూడా మరింత మేలు జరుగుతుంది. ప్రస్తుతం దేశం పరిస్థితి అధ్వానంగా ఉంది. ప్రధాని మోదీ పాలనలో పేదలకు సంక్షేమ పథకాలు అందడం లేదు. పాలన గాడి తప్పుతున్నది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నేత దేశ రాజకీయాల్లోకి వెళ్లడం మంచి విషయమే. దేశంలో మార్పు తీసుకువచ్చే శక్తి కేసీఆర్కే ఉంది.