సిటీబ్యూరో, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): నగరంలో ట్రాఫిక్ సాఫీగా వెళ్లేందుకు చేపట్టిన క్రమబద్ధ్ధీకరణలో భాగంగా నిర్వహిస్తున్న ‘రోప్'(రిమూవల్ అబస్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎన్క్రోచ్మెంట్)ను అమలుకు జీహెచ్ఎంసీ సహకరించాలని ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ కోరారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఇచ్చిన ఆదేశాల మేరకు హైదరాబాద్లో రోప్ను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసి, క్షేత్ర స్థాయి నుంచి ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారంపై చర్చించారు. రోడ్లపై అక్రమ పార్కింగ్, క్యారేజ్ వేలు, ఫుట్పాత్ల ఆక్రమణలను తొలగించి సాఫీగా ట్రాఫిక్ వెళ్లేందుకు ఏమి చేయాలనే అంశాలను చర్చించారు.
జీహెచ్ఎంసీ నుంచి చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్రెడ్డి, జోనల్, సర్కిల్ కమిషనర్లు హాజరయ్యారు.ఈ సందర్భంగా ట్రాఫిక్, జీహెచ్ఎంసీ అధికారులు ట్రాఫిక్ ఇబ్బందులెక్కడున్నాయనే విషయాన్ని సంయుక్తంగా తనిఖీలు చేసి, హాకర్స్ వంటి వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి, ఎక్కడైతే అవకాశాలున్నాయో అక్కడ సింగిల్ లైన్ పార్కింగ్ను ఏర్పాటు చేయాలి, ఇది ఇతరులకు ఇబ్బంది కల్గించకుండా ఉండాలని నిర్ణయించారు. అలాగే జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీస్ క్షేత్ర స్థాయిలో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించాలి. పార్కింగ్కు అనుకూలమైన ప్రాంతాలను గుర్తించాలి. బస్స్టాప్లు, ఆటో పార్కింగ్, హాకర్స్ను జంక్షన్ల దగ్గర నుంచి షిప్ట్ చేయాలి. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కెమెరాలు ఫిక్స్ చేసి, ట్రాఫిక్ రద్దీకి కారణాలపై క్షేత్ర స్థాయిలో లోతైన అధ్యయనం చేయాలని సమన్వయ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ డీసీపీ కరుణాకర్, అదనపు డీసీపీలు రంగారావు, ప్రసాద్, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.