ముషీరాబాద్, అక్టోబర్ 4: భిన్న మతాలు, సంస్కృతులు కలిగిన భారతదేశంలో లౌకిక రాజ్యస్థాపన సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రావులపాటి మోజస్ అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ఆవిర్భవించబోతున్న జాతీయ పార్టీని క్రైస్తవ సంఘాలు స్వాగతిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం రాంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు ఫాస్టర్లతో కలిసి మాట్లాడారు. గణతంత్ర, లౌకిక రాజ్యాన్ని కొంత మంది మతోన్మాదులు విచ్ఛిన్నం చేస్తున్నారని, వారి చర్యలు అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నాయని తెలిపారు. 75 సంవత్సరాల లౌకిక సూత్రాలను పాతరేస్తూ వింతపోకడలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేంద్రాన్ని పాలిస్తున్న వారు ఒక వర్గానికే కొమ్ముకాస్తూ మైనారిటీలను అవమానాలకు గురిచేస్తూ దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడిగా సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో పార్టీ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో మైనారిటీల పట్ల సానుకూల ద్రుక్పథం కలిగి ఉన్న కేసీఆర్ దేశంలో ఇదే రీతిన ముందుకుసాగితే విజయం సాధిస్తారని అన్నారు. దేశవ్యాప్తంగా క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ కేసీఆర్కు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కేసీఆర్ పట్ల పూర్తి విశ్వాసంతో కాకినాడలో జరిగిన క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో ఫాస్టర్లు క్రిస్టఫర్, విక్టర్, తదితరులు పాల్గొన్నారు.