సిటీబ్యూరో, అక్టోబరు 4 (నమస్తే తెలంగాణ): ఆదాయం పెంపు లక్ష్యంగా జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఏటా రూ.2500కోట్ల మేర బల్దియాకు ఆస్తిపన్ను, నిర్మాణ రంగ అనుమతులు, అద్దెల రూపంలో ఆదాయం సమకూరుతున్నది. ఆస్తిపన్ను, నిర్మాణ రంగ అనుమతుల్లో గతంలో కంటే ఈ ఏడాది ఆశించిన స్థాయిలో రెవెన్యూ సమకూరగా, తాజాగా అద్దెల రూపంలో రావాల్సిన ఆదాయం సరిగా రావడం లేదని గుర్తించి ప్రత్యేకంగా ఎస్టేట్ విభాగం అధికారులు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. మార్కెట్స్, షాపింగ్ కాంప్లెక్స్లు, స్థలాల లీజు అద్దెలు సకాలంలో రాబట్టి ఆదాయాన్ని పెంచాలని నిర్ణయించి ఈ మేరకు అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. వీటితో పాటు ఎస్ఆర్డీపీలో భాగంగా చేపట్టిన ఐకానిక్ బ్రిడ్జిలు, లింకు రోడ్ల వెంబడి సీరియల్స్, సినిమా షూటింగ్లు ఇటీవల ఎక్కువగా పెరిగాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ.2.16 కోట్లు అద్దెల రూపంలో సమకూర్చుకున్నది.
అనుమతుల్లో కండిషన్స్.!
2019 నుంచి ఆన్లైన్ పద్ధతిలో ఆనుమతులు జారీ చేస్తున్నది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని అనుమతి పొందే వెసులుబాటును కల్పించింది. నిర్ణీత మొత్తం ఆన్లైన్లో/కమిషనర్ జీహెచ్ఎంసీ పేరిట డీడీ తీసి అధికారులకు సమర్పించడం ద్వారా అనుమతి పొందవచ్చు. ప్రాంతాలతో సంబంధం లేకుండా గంటల వారీగా అద్దె నిర్ణయించారు. ఒక రోజు షూటింగ్కు (ఎనిమిది గంటలకు మించకుండా) కనీస రుసుం రూ.30వేలు చెల్లించాలి. ఆ తర్వాత ఒక్కో గంటకు రూ.4వేలు అదనం. రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్గా రూ.40వేలు చెల్లించాల్సి ఉంటుంది. పోలీస్ అధికారుల నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఉంటేనే చిత్రీకరణకు అనుమతి ఇస్తారు.