సిటీబ్యూరో, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): డేటింగ్ యాప్తో నగర వాసికి రూ.1.53 కోట్లు మోసం చేసిన ఢిల్లీకి చెందిన సైబర్ నేరగాళ్ల గ్యాంగ్లోని ఒక నిందితుడిని సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం బషీర్బాగ్లోని కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాయింట్ సీపీ గజారావు భూపాల్, ఏసీపీ కేవీఎం ప్రసాద్ వివరాలను వెల్లడించారు. పద్మారావునగర్కు చెందిన బాధితుడికి గిగ్లో ప్లేబాయ్ సర్వీసెస్ డేటింగ్ యాప్ ద్వారా ఎస్కార్ట్ సర్వీసెస్ పేరుతో యువతులు పరిచయమయ్యారు. వారితో రోజు చాటింగ్ చేస్తూ, వీడియో కాల్స్ మాట్లాడిన బాధితుడు 2020 నుంచి దఫ దఫాలుగా వివిధ బ్యాంకు ఖాతాలకు రూ. 1,53,38,527 పంపించాడు. సైబర్ నేరగాళ్ల మోసాన్ని ఆలస్యంగా గ్రహించిన బాధితుడు సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
కాల్ సెంటర్ ముసుగులో..
ఢిల్లీలో అరుణ్, మెహిత్, దీపక్, మంజీత్, నీతు, సోలంకి.. మరికొందరు కలిసి ఒక కాల్సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ కాల్ సెంటర్లో యువతులను ఉద్యోగులుగా నియమించుకున్నారు. వారి ద్వారా అమాయకులను ఆన్లైన్ రొమాన్స్ పేరుతో మోసాలు చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుల్లో ఒకరైన అరుణ్ను ఢిల్లీలో పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి రెండు ఖాతాల్లో బాధితుడు రూ. 30 లక్షలు డిపాజిట్ చేశాడు. మిగతా నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు వె ల్లడించారు.