బంజారాహిల్స్, అక్టోబర్ 4: అసాధ్యమైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యాన్ని సుసాధ్యం చేయడమే కాకుండా దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని అగ్రస్థానంలో నిలబెట్టిన సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టించడం ఖాయమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. విజయదశమి రోజున జాతీయ రాజకీయాల్లో ప్రవేశంతో పాటు పార్టీ పేరును సీఎం కేసీఆర్ ప్రకటన చేయనున్న సందర్భంగా భారీ ఎత్తున సంబురాలు నిర్వహించేందుకు ఖైరతాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు. బంజారాహిల్స్లో మంగళవారం నియోజకవర్గ స్థాయి ముఖ్యనాయకులు, కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలనే పార్టీల కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.
దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే స్పష్టమైన ఎజెండాతో సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పనిచేస్తుందన్నారు. విజయదశమి రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చరిత్రాత్మక ఘట్టం అన్నారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రగతిభవన్ నుంచి తెలంగాణ భవన్ దాకా ముఖ్యమంత్రి కేసీఆర్కు భారీ ఎత్తున స్వాగతం పలుకుతారన్నారు. మధ్యాహ్నం 1.19 నిమిషాలకు జాతీయ పార్టీ ప్రకటన చేయగానే అన్ని డివిజన్లలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మన్నె కవితారెడ్డి, వెల్దండ వెంకటేశ్, వనం సంగీతయాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్నా రామ్మూర్తి, టీఆర్ఎస్ సీనియర్ నేత మామిడి నర్సింగరావు, వివిధ డివిజన్ల అధ్యక్షులు రాములు చౌహాన్, అరుణ్కుమార్, మహేందర్బాబు, పద్మ, దీపాదేవి, సుధాకర్రెడ్డి, నగేష్సాగర్, తిరుమలేష్నాయుడు తదితరులు పాల్గొన్నారు.