సిటీబ్యూరో, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ):మహాత్మాగాంధీ జయంతి వేడుకలను ఆదివారం గ్రేటర్వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పలువురు నేతలు మహాత్ముడికి ఘనంగా నివాళులర్పించారు. అహింసా సిద్ధాంతాలు ప్రబోధించిన మహాత్ముడు సదా స్మరణీయుడంటూ.. దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. గాంధీ వైద్యశాల వద్ద 16 అడుగుల బాపూజీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. కరోనా విపత్తును ధైర్యంగా ఎదుర్కొని ప్రజల ప్రాణాలు కాపాడిన ఘనత గాంధీ దవాఖానదని, గాంధీజీ స్ఫూర్తిని నింపుకొని పనిచేసిన సిబ్బందికి సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. ఇక బొటానికల్ గార్డెన్లో నిర్వహించిన రన్ ఫర్ పీస్లో ఔత్సాహికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
కరోనా సమయంలో గాంధీజీ స్ఫూర్తిని నింపుకొని పనిచేసిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, గాంధీ దవాఖాన వైద్యులు, సిబ్బందికి సెల్యూట్ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. ఆదివారం ఉదయం 11:45గంటలకు రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్గౌడ్, తదితరులతో కలిసి సీఎం కేసీఆర్ సికింద్రాబాద్లోని గాంధీ దవాఖాన వద్ద ఏర్పాటు చేసిన 16 అడుగుల గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం దవాఖాన ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ స్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కరోనాతో యావత్ ప్రపంచం గడగడలాడుతున్న సమయంలో ఇక్కడి వైద్యులు వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి, వైరస్ను ఎదుర్కొని, ప్రజల ప్రాణాలు కాపాడారని అన్నారు. గాంధీ దవాఖాన సూపరింటెండెంట్తో పాటు వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది అంతా గాంధీజీని ఆదర్శంగా తీసుకొని కరోనాపై యుద్ధమే చేశారని తెలిపారు. పీపీఈ కిట్స్ తదితర వసతులు ఉన్నా, లేకున్నా కరోనాను ఎదుర్కొన్నారని, ప్రైవేటు దవాఖానలకు వెళితే తిరిగి పంపిన రోగులను కూడా గాంధీలో చేర్చుకొని, వారి ప్రాణాలు కాపాడారని గుర్తుచేశారు. ఇక్కడ ఇంత పెద్ద విగ్రహం ఏర్పాటు చేసుకోవడం మన రాష్ర్టానికే గర్వకారణమని అన్నారు. ఈ సందర్భంగా నర్సింగ్ విద్యార్థులు తమ ైస్టెపెండ్ పెంచినందుకుగాను సీఎం కేసీఆర్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఇందులోభాగంగా గాంధీ దవాఖాన పరిసరాలు జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో మారుమోగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీఎంఈ డా.రమేశ్ రెడ్డి, గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డా.రాజారావు, ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డా.నాగేందర్, హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.వెంకటి, వైద్యాధికారులు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గాంధీ స్ఫూర్తితోనే రాష్ట్ర సాధన: మంత్రి తలసాని
అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహనీయుడు మహత్మాగాంధీ అని, ఆయన స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మన దేశమే కాకుండా ప్రపంచం మొత్తం గాంధీజీ చూపిన బాటను అనుసరిస్తున్నదన్నారు. గాంధీ జయంతి రోజున మహత్మాగాంధీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
సెల్ఫీజోన్గా మారిన గాంధీ విగ్రహం
సీఎం చేతుల మీదుగా ఆవిష్కరించిన 16అడుగుల గాంధీ విగ్రహం సెల్ఫీజోన్గా మారింది. చిన్నా, పెద్దా తేడాలేకుండా ప్రతిఒక్కరూ గాంధీ విగ్రహం వద్దకు వచ్చి సెల్ఫీలు దిగేందుకు పోటీపడటం కనిపించింది. గాంధీ విగ్రహం వద్ద తీసిన వీడియోలు, ఫొటోలలో ఎత్తైన గాంధీజీ విగ్రహం పైభాగాన ‘గాంధీ హాస్పిటల్’ అనే బోర్డు రావడంతో ఫొటోలు దిగిన వారు అది చూసి మురిసిపోవడం కొసమెరుపు.