సంగారెడ్డి, అక్టోబర్ 2(నమస్తే తెలంగాణ): తెలంగాణతో సంబంధం లేని వారు ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తామంటే.. ఇక్కడి ప్రజలు సహించరని, వారు అమాయకులు కాదని మంత్రి హరీశ్రావు అన్నారు. సీఎం కేసీఆర్కు తెలంగాణ మీద, ఇక్కడి ప్రజల మీద ఉన్నంత ప్రేమ ఇతరులకు ఉంటుందా అని ప్రశ్నించారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో మంత్రి హరీశ్రావు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పటాన్చెరు బస్టాండు ఎదుట కొండా లక్ష్మణ్ బాపూజీ, పట్టణంలో గాంధీ విగ్రహాలను ఆవిష్కరించారు. అక్కడే నిర్మించిన థీమ్ పార్కు, జిమ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ కోసం 14 ఏండ్లు పోరాటం చేశారని, ఆమరణదీక్ష చేపట్టారని గుర్తు చేశారు. తెలంగాణకు సంబంధంలేని వారు ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తే ప్రజలు సహించరని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వానికి అన్ని రంగాల్లో అవార్డులు రావడాన్ని చూసి కేంద్రంలోని బీజేపీ ఓర్వడం లేదని, తెలంగాణకు వరుసగా అవార్డులు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అవార్డులు రద్దు చేస్తుందేమోనని అన్నారు. అవార్డుల విషయంలో కిరికిరి చేస్తున్న బీజేపీ రాష్ర్టానికి రావాల్సిన నిధులు మాత్రం ఇవ్వడం లేదన్నారు. మిషన్ భగీరథ పథకానికి రూ.19వేల కోట్ల నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా కేంద్రం ఇవ్వడంలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ తరహాలో దేశంలో ఏరాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు కావడం లేదన్నారు. ఇవి చూసి ఓర్వలేక కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందన్నారు.
చేనేత రంగాన్ని నిర్వర్యీం చేస్తున్న కేంద్రం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నదని మంత్రి హరీశ్రావు విమర్శించారు. నేషనల్ హ్యాండ్లూమ్ బోర్డు, హ్యాండిక్రాఫ్ట్ బోర్డును రద్దు చేసిందన్నారు. నూలుపై రాయితీని సహితం రద్దు చేసి చేనేత రంగాన్ని దెబ్బ తీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికుల ఉసురు పోసుకుంటున్నదన్నారు.