సిటీబ్యూరో, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో సీఎన్జీ కొరత వేధిస్తున్నది. డిమాండ్కు తగ్గట్టు సరఫరా లేకపోవడంతో వాహనదారులు అవస్థలుపడుతున్నారు. ఇంధన ధరల మోతతో సొంత వాహనాల్లో దసరా పండుగకు ఊరికి వెళ్లేందుకు చాలా మంది సాహసించడం లేదు. ఇదిలా ఉంటే అధిక మైలేజీతో పాటు తక్కువ ధరకు లభించే సీఎన్జీ, ఎల్పీజీ గ్యాస్ కొరత వల్ల ఇప్పుడు ఆటో కార్మికులు, ట్యాక్సీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. డిమాండ్కు తగ్గట్టు సరఫరా లేకపోవడంతో వారికి తిప్పలు తప్పడం లేదు.
డిమాండ్కు తగ్గట్టు..
నగరంలో సీఎన్జీ, ఎల్పీజీ గ్యాస్ కొరత తీవ్రంగా ఉందని, డిమాండ్కు తగ్గట్టు సరఫరా లేకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాహనదారులు వాపోతున్నారు. గ్రేటర్ పరిధిలోని సుమారు 80 సీఎన్జీ, ఎల్పీజీ గ్యాస్ స్టేషన్లు అందుబాటులో ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో సగానికిపైగా నో స్టాక్ బోర్డుతో దర్శనమిస్తున్నాయని పేర్కొంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో కేజీ గ్యాస్ ధర రూ.94 ఉండగా, మరో రూ.5 అదనంగా బంకు యాజమాన్యాలు వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. నగరంలో సుమారు 4లక్షల వరకు గ్యాస్ ఆధారిత వాహనాలు తిరుగుతున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు.
గత్యంతరం లేక..
అధిక మైలేజీతో పాటు తక్కువ ధరకు సీఎన్జీ, ఎల్పీజీ గ్యాస్ లభిస్తుండటంతో వాహనదారులు వీటిపైనే ఆధారపడుతున్నారు. కాగా, గ్యాస్ కొరతతో విధిలేని పరిస్థితుల్లో తిరిగి పెట్రోల్, డీజిల్ వినియోగించుకోవాల్సి వస్తున్నదని వాహనదారులు, ఆటోవాలాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నో స్టాక్ పేరుతో బంకు నిర్వాహకులు వాహనదారులకు ఇబ్బందులు కలిగించొద్దని వాహన సంఘాల నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. కేంద్రంలోని కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీ ప్రభుత్వమే ఈ పరిస్థితికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.