సిటీబ్యూరో, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ చుట్టూ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఔటర్ రింగురోడ్డు నిర్వహణను దీర్ఘకాలిక లీజుకు ఇచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (టీఓటీ) విధానంలో 20 ఏండ్ల పాటు లీజుకు ఇవ్వడం ద్వారా పెద్ద మొత్తంలో నిధులను ఒకేసారి సమకూర్చుకునేందుకు హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాచరణను రూపొందించింది. ఈ విధానంలో ఓఆర్ఆర్ను దీర్ఘకాలిక లీజుకు ఇవ్వడంతో ఒకేసారి సుమారు రూ.5వేల కోట్ల వరకు హెచ్ఎండీఏకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ టెండర్లను పిలిచి ఆసక్తి ఉన్న సంస్థలను ఎంపిక చేసే బాధ్యతలను కన్సల్టెన్సీలకు అప్పగించడంపై అధికారులు దృష్టిసారించారు. ప్రస్తుతం లావాదేవీల సలహాదారు ఎంపిక ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు సంబంధించిన డేటాను పరిగణనలోకి తీసుకొని.. మూల్యాంకనం చేసి, ప్రస్తుతం సమకూరుతున్న వాస్తవ ఆదాయాన్ని భవిష్యత్తుతో అంచనా వేస్తారు. ఒప్పంద వ్యవధితో పాటు భవిష్యత్ టోల్ ఆదాయాలను అంచనా వేసి నివేదికను హెచ్ఎండీఏకు అందజేస్తారు.
కాగా, ఈ ప్రక్రియ ఒకవైపు కొనసాగుతుండగానే హెచ్ఎండీఏ ప్రకటించిన టీఓటీ విధానం పట్ల పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తీసుకొని అధ్యయనం చేస్తున్నాయి. ఇందులో ఎంపిక చేసిన సంస్థలకు సుమారు 20 సంవత్సరాల పాటు ఓఆర్ఆర్ నిర్వహించే హకును కల్పిస్తుండగా, దానికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తుగా ఒకేసారి మొత్తాన్ని అందజేయాల్సి ఉంటుంది.
ప్రైవేటు సంస్థల ద్వారా సమర్థవంతమైన నిర్వహణ..
దీర్ఘకాలిక లీజుకు అప్పగించడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అధికారులు గుర్తించారు. ప్రధానంగా ఓఆర్ఆర్పై ఆస్తులను పర్యవేక్షించడంలో హెచ్ఎండీఏకు భారాన్ని తగ్గిస్తుంది. అదేవిధంగా.. ప్రైవేట్ భాగస్వామ్యం కారణంగా ఓఆర్ఆర్పైన మెరుగైన నిర్వహణ కొనసాగుతూ ఉంటుంది. నేరుగా హెచ్ఎండీఏ తరఫున నిర్వహణ చేపట్టాలంటే పెద్ద మొత్తంలో ఉన్నతాధికారులు పనిచేయాల్సి ఉంటుంది. దీనికి బదులుగా ప్రైవేటుకు అప్పగించడం ద్వారా రెండు విధాలా మంచి ప్రయోజనమే కలుగుతుందని గుర్తించి, టీఓటీ విధానంలో ఓఆర్ఆర్ను దీర్ఘకాలిక లీజుకు ఇచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని హెచ్ఎండీఏకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. ప్రధానంగా టోల్ వసూలు, సాధారణ నిర్వహణలో భాగంగా గుంతలు, పగుళ్లు, కాలువలు, జాయింట్ల యొక సత్వర మరమ్మతులు చేయడం, అవసరమైనప్పుడు టోలింగ్ వ్యవస్థను పునరుద్ధరించడం ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే చాలా సులభంగా ఉంటుంది. ఇప్పటికే దేశంలోని ఇలాంటి విధానాలు అమలులో ఉండటం వల్లే హెచ్ఎండీఏ సైతం ఆ దిశగా కసరత్తు చేస్తుంది. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసి.. పెద్ద మొత్తంలో ఒకేసారి నిధులను రాబట్టే పనిలో హెచ్ఎండీఏ అధికార యంత్రాంగం నిమగ్నమై ఉంది.