సిటీబ్యూరో, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): పాకిస్తాన్లో తిష్టవేసిన ఉగ్రవాదుల ఆదేశాల మేరకు హైదరాబాద్లో విధ్వంసాలకు కుట్రపన్నిన ముగ్గురిని నగర పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నాలుగు హ్యాండ్ గ్రనేడ్స్, పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో మలక్పేటకు చెందిన అబ్దుల్ జాహెద్ అలియాస్ మోటు(39), సైదాబాద్ అక్బర్బాగ్కు చెందిన మహ్మద్ సమీయుద్దీన్ (39), మెహిదీపట్నం నివాసి మాజ్ హసన్ ఫరూఖీ (29) ఉన్నారు. గతంలో హైదరాబాద్లో విధ్వంసాలు, విధ్వంసాలకు కుట్రలు పన్ని.. ప్రస్తుతం పాకిస్తాన్లో తలదాచుకుంటున్న ఉగ్రవాదులతో ఈ ముగ్గురికి సంబంధాలు ఉన్నాయని, అక్కడి నుంచి వారిచ్చిన సూచనల మేరకే అరెస్టయిన ముగ్గురు నిందితులు హైదరాబాద్లో భారీ పేలుళ్లకు కుట్రపన్నినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ వివరాలను హైదరాబాద్ పోలీసులు ఆదివారం వెల్లడించారు. హైదరాబాద్కు చెందిన ఫర్హతుల్లా ఘోరీ అలియాస్ ఎఫ్జీ, సిద్ధీఖ్ బిన్ ఉస్మాన్కు 2002లో దిల్సుఖ్నగర్ సాయిబాబా ఆలయం వద్ద జరిగిన పేలుళ్లు, 2004లో సికింద్రాబాద్ గణేశ్ టెంపుల్ వద్ద పేలుళ్లకు కుట్ర, 2005లో దసరా పండుగ రోజున బేగంపేటలోని టాస్క్ఫోర్స్ కార్యాలయంపై జరిగిన మానవబాంబు దాడి, ముంబైలోని ఘటకోపర్లో బస్సులో పేలుడు.. తదితర ఘటనలతో సంబంధం ఉన్నది.
నిందితులు 2004లో పాకిస్తాన్కు వెళ్లి అక్కడ ఐఎస్ఐ, ఇతర ఉగ్రవాద సంస్థలతో సంబంధలు పెట్టుకొని అక్కడే ఉంటున్నారు. ప్రస్తుతం మూసారాంబాగ్లో నివాసముండే అబ్దుల్ జాహెద్ అలియాస్ మోటుకు కూడా 2005లో టాస్క్ఫోర్స్ కార్యాలయంపై జరిగిన మానవ బాంబు దాడితోపాటు పలు ఉగ్ర కేసులతో సంబంధాలు ఉన్నాయి. పాకిస్తాన్లో ఉన్న ఘోరీ టీమ్ గతంలో ఐఎస్ఐలో పనిచేసి.. ఆ తర్వాత ఐసీస్లో పని చేసింది. ప్రస్తుతం ఉగ్రవాదులను రిక్రూట్ చేసుకునే పనిలో ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో మరోసారి భారీ పేలుళ్లు జరుపాలని పధకం రచించారు. ఇందుకు గతంలో ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న మూసారాంబాగ్కు చెందిన అబ్దుల్ జాహెద్ను సంప్రదించారు. కావాల్సిన ఆర్థిక సహాయం చేయడంతో పాటు పేలుడు పదార్థాలు కూడా సరఫరా చేస్తామంటూ హామీ ఇచ్చారు. పాకిస్తాన్ హాండ్లర్స్ సూచన మేరకు జాహెద్తో పాటు సైదాబాద్కు చెందిన మహ్మద్ సమీయుద్దీన్, మెహిదీపట్నంకు చెందిన మాజ హసన్ ఫరూఖీ అలియాస్ మాజ హైదరాబాద్లో విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేశారు. ఈ మేరకు పాకిస్తాన్ నుంచి నాలుగు హ్యాండ్ గ్రనేడ్స్ కూడా వీరికి అందాయి. రాష్ట్ర నిఘా వర్గాలకు అందిన సమాచారంతో ఆదివారం హైదరాబాద్ సీసీఎస్ నేతృత్వంలోని సిట్, టాస్క్ఫోర్స్ బృందాలు వారిని అదుపులోకి తీసుకొని, ఇండ్లల్లో సోదాలు చేశారు. ఈ సోదాల్లో అబ్దుల్ జాహేద్ వద్ద రెండు గ్రనేడ్స్, రూ. 3.91,800, 2 మొబైల్ ఫోన్లు, సమీయుద్దీన్ వద్ద ఒక గ్రనేడ్, రూ.1.5 లక్షలు, ఒక మొబైల్, మోటర్ సైకిల్, మాజ హసన్ వద్ద ఒక గ్రనేడ్స్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఉగ్రవాది షాహెద్ బిలాల్ సోదరుడే అబ్దుల్ జాహెద్..!
మూసారాంబాగ్కు చెందిన షాహెద్ బిలాల్కు హైదరాబాద్లో 2000 నుంచి 2005 వరకు జరిగిన ఉగ్ర వాద పేలుళ్లు, కుట్రలతో ప్రత్యక్ష, పరోక్షంగా సంబంధాలున్నాయి. పాకిస్తాన్కు పరారైన తర్వాత హైదరాబాద్తో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో అతడు విధ్వంసాలు చేయించాడని నిఘా వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్లో అతడు హర్కతు ఉల్ జిహాదీ ఉగ్రసంస్థలో చేరి, పలువురిని ఉగ్రవాదం వైపు మళ్లించాడు. 2002లో సాయిబాబా గుడి, 2005 టాస్క్ఫోర్స్ కార్యాలయం, 2007లో జరిగిన లుంబిని పార్కు, గోకుల్చాట్ పేలుళ్ల వరకు అతడు పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత పాకిస్తాన్లో జరిగిన ఒక ఎన్కౌంటర్లో షాహెద్ బిలాల్ మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. టాస్క్ఫోర్స్ కార్యాలయంపై దాడి చేసిన మానవబాంబు(డాలిన్)కు మూసారాంబాగ్లోని తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అయితే, బిలాల్ సోదరుడైన అబ్దుల్ జాహెద్ కూడా ఈ కుట్రలలో కీలక పాత్ర పోషించాడన్న ఆరోపణలు కూడా అప్పట్లో వచ్చాయి.
ఘోరీది ప్రత్యేక సామ్రాజ్యం..
హైదరాబాద్ నుంచి పరారై ప్రస్తుతం పాకిస్తాన్లో ఉగ్రవాద నెట్వర్క్లో కీలక పాత్ర పోషిస్తున్న ఫర్హతుల్లా ఘోరీ మొదట్లో షాహెద్ బిలాల్తో కలిసి ఉగ్రవాద సంస్థలో పనిచేశాడు. బిలాల్ ఎన్కౌంటర్ తర్వాత ఘోరీ కరుడుగట్టిన పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాది, భారత్కు మోస్ట్ వాంటెడ్ అయిన మౌలానా అజార్ వద్ద పనిచేశాడు. ఆ తర్వాత ఐసీస్లో పనిచేశాడు. మౌలానా అజార్ ప్రభావం కోల్పోవడంతో ప్రస్తుతం ఘోరీ ప్రత్యేకంగా ఓ ఉగ్రవాద సంస్థనే నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం భారతదేశంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకులను టార్గెట్ చేయడం, దేశంలోని పలు ప్రధాన నగరాల్లో విధ్వంసాలు సృష్టించి ప్రాణ నష్టం కలిగించాలన్న లక్ష్యంతో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు దేశంలో చాపకింద నీరులా ఉగ్రవాద రిక్రూట్మెంట్ను కొనసాగిస్తున్నారని పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ మేరకు నిఘాను ముమ్మరం చేశారు.
గ్రనేడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి..?
పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆదేశాలతో ముగ్గురు నాలుగు హ్యాండ్ గ్రనేడ్స్ సంపాదించారు. అయితే, అవి ఎక్కడి నుంచి వచ్చాయన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు అవి జమ్ము కశ్మీర్ నుంచి వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జమ్మూకశ్మీర్లో పట్టుబడుతున్న ఉగ్రవాదులు ఇలాంటి హ్యాండ్ గ్రనేడ్స్నే అప్పుడప్పుడు సైన్యంపై విసురుతుంటారని పోలీసులు గుర్తించారు. ఈ గ్రనేడ్స్పై సైన్యాధికారులు ఆరా తీయడంతో.. అవి చైనాలో తయారవుతున్నట్లు తేలింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చైనాలో తయారవుతున్న గ్రనేడ్స్ను సమకూర్చుకుంటున్న విషయం బయటపడింది. హైదరాబాద్లో ఆదివారం అరెస్టయిన నిందితులు కూడా పాకిస్తాన్ నుంచి అందిన ఆదేశాల మేరకు జమ్మూకశ్మీర్లో ఉన్న ఉగ్రవాదులు వీరికి గ్రనేడ్స్ సరఫరా చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.