కేపీహెచ్బీ కాలనీ, అక్టోబర్ 1 : దీర్ఘకాలిక సమస్యలన్నింటినీ పరిష్కరించి బాలాజీనగర్ డివిజన్ను ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శనివారం బాలాజీనగర్ డివిజన్లో రూ.16.80 లక్షలతో అభివృద్ధి చేసిన చిన్నారుల పార్కు, రూ.25 లక్షలతో అల్లూరి సీతారామరాజు గ్రౌండ్ అభివృద్ధి పనులు రూ.45 లక్షలతో భువనవిజయం గ్రౌండ్ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు రూ.16.80 లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్లను ఎమ్మెల్యే కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేపీహెచ్బీ కాలనీలో పురాతన కాలంనాటి డ్రైనేజీ, తాగునీటి పైప్లైన్ వ్యవస్థను ఆధునీకరించామని భవిష్యత్లో సమస్యలుత్పన్నం కాకుండా పకడ్బందీగా అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు.
అంతర్గత రోడ్ల అభివృద్ధి, విద్యుత్ సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలన్నింటినీ పార్కులుగా, క్రీడా ప్రాంగణాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. బాలాజీనగర్ కాలనీలో మహిళలు, చిన్నారుల కోసం ప్రత్యేకంగా పార్కును అభివృద్ధి చేశామని.. దీనిని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేస్తున్నామని.. ఓపెన్ జిమ్, ఇండోర్ షటిల్ కోర్టులను క్రీడారులు, సామాన్య ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొన్ని రాజకీయ పార్టీల నేతలు కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని.. వారి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కులమతాలకతీతంగా ప్రశాంతమైన పాలనను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పగుడాల శిరీషాబాబురావు, మందడి శ్రీనివాస్రావు, నియోజకవర్గం కో ఆర్డినేటర్ సతీశ్ అరోరా, స్థానిక టీఆర్ఎస్ పార్టీ నేతలున్నారు.