శామీర్పేట, సెప్టెంబర్ 30 : ప్రజా అవసరాల నిమిత్తం వంటింటి వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తికి తూంకుంట మున్సిపాలిటీ శ్రీకారం చుట్టిందని తూంకుంట మున్సిపాలిటీ చైర్మన్ కారంగుల రాజేశ్వర్రావు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు హకీంపేట డీఆర్సీ సెంటర్లో బయోమెతనేషన్ ప్లాంట్ ఏర్పాటుకు బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్తో తూంకుంట మున్సిపాలిటీ శుక్రవారం పరసర్పం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. వంటింటి వ్యర్థాలతో కూడిన ఆర్గానిక్ వేస్ట్తో నిర్వహించబడే బయోమెతనేషన్ ప్లాంట్ను బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టనున్నదని తెలిపారు. రెండు టన్నుల సామర్థ్యంతో కూడిన ఈ ప్రాజెక్టును తూంకుంట మున్సిపాలిటీ 9వ వార్డు హకీంపేట డీఆర్సీ సెంటర్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్లాంట్ ఏర్పాటుతో విద్యుత్, సీఎన్జీ, బయోగ్యాస్, ఇథనాల్ ఆయిల్ ఉత్పత్తి అవుతుందన్నారు. మున్సిపాలిటీ ప్రజల భవిష్యత్తు అవసరాల నిమిత్తం వినియోగిస్తామని తెలిపారు. విద్యుత్ తయారీ తర్వాత మిగులు వ్యర్థాలను 0(జీరో) వేస్టేజ్ కింద ఎరువులుగా ఉపయోగించుకోవచ్చని సూచించారు. ఈ పైలెట్ ప్రాజెక్టు కింద ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తున్న బిట్స్ పిలానీ యాజమాన్యానికి మున్సిపాలిటీ ప్రజలు రుణపడి ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో తూంకుంట మున్సిపాలిటీ కమిషనర్ జేతూరామ్, బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ ప్రొఫెసర్ జి.సుందర్, ప్రతినిధులు పి.శంకర్, టెక్నికల్ బృందం పాల్గొన్నారు.