సికింద్రాబాద్, సెప్టెంబర్ 29: రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డికి కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో చుక్కెదురైంది. ఎంపీ హోదాలో బోర్డు సమావేశానికి హాజరైన రేవంత్రెడ్డికి ఓ భవన నిర్మాణానికి సంబంధించిన అనుమతుల విషయంలో మిగతా సభ్యుల అభ్యంతరంతో అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళితే.. 2008లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్రెడ్డి కాంగ్రెస్ పార్టీ భవనం కోసం బోయిన్పల్లి ప్రాంతంలో 10 ఎకరాల భూమిని భూ బదలాయింపు కింద కేటాయించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇనిస్టిట్యూట్ భవనం నిర్మించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తరఫున కంటోన్మెంట్ బోర్డు అనుమతి కోసం గతనెలలో దరఖాస్తు చేశారు. గురువారం జరిగిన బోర్డు సమావేశంలోని ఎజెండాలో భవన నిర్మాణ అనుమతికి సంబంధించిన అంశాన్ని కూడా పొందుపర్చారు. సమావేశం ప్రారంభమైన తర్వాత 10 ఎకరాల స్థలంలో ఇనిస్టిట్యూట్ భవన నిర్మాణానికి బోర్డు అధికారులు గ్రీన్సిగ్నల్ ఇచ్చే సమయంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ అధికారుల నిర్ణయాన్ని తప్పుబట్టారు.
ఏ విధంగా 10 ఎకరాల స్థలంలో నిర్మాణాలకు అనుమతి ఇస్తారంటూ.. అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒకానొక దశలో అనుమతి ఇస్తే సీబీఐకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. 2008లో అప్పటి ప్రభుత్వం భూమిని కేటాయించిన నేపథ్యంలోనే ఏడాదికి ఒకసారి ఎన్వోసీ తప్పనిసరిగా సమర్పించాలని ఉన్నదని, ఇంతకాలం మిన్నకుండిపోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దరఖాస్తు చేసుకుని అనుమతి ఇవ్వమంటే ఎలా.. అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి కేటాయించిన స్థలానికి సంబంధించి ప్రస్తుత జిల్లా కలెక్టర్ నుంచి ఎన్వోసీ తీసుకువస్తేనే అనుమతి ఇవ్వాలని, లేని పక్షంలో అధికారులు ఏకపక్షంగా ముందుకు సాగితే చట్టపరంగా వెళ్లాల్సి వస్తుందని స్పష్టం చేశారు. దీంతో చేసేది లేక అధికారులు నెల రోజుల సమయంలో కలెక్టర్ నుంచి ఎన్వోసీ సమర్పిస్తే అనుమతులు ఇవ్వడం జరుగుతుందని, అప్పటి వరకు తాత్కాలికంగా అనుమతిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సమావేశంలో ఎమ్మెల్యేతో పాటు నామినేటెడ్ సభ్యుడు అనుమతికి సంబంధించి అభ్యంతరం వ్యక్తం చేయడంతో చేసేదేమి లేక సమావేశం నుంచి రేవంత్రెడ్డి బయటకు వచ్చేశారు.