సిటీబ్యూరో, సెప్టెంబరు 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ను అత్యంత నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దే ప్రణాళికల్లో తలమునకలై ఉన్న జీహెచ్ఎంసీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వాహన కాలుష్య తీవ్రతను తగ్గించి పర్యావరణాన్ని రక్షించే చర్యల్లో భాగంగా నగరమంతటా సైకిల్ ట్రాక్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఖైరతాబాద్ జోన్లో కేబీఆర్ పార్కు వద్ద, శేరిలింగంపల్లి జోన్లో హైటెక్స్ వద్ద, కూకట్పల్లి జోన్లో మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద జీహెచ్ఎంసీ ఇప్పటికే ప్రయోగాత్మకంగా ట్రాక్లను తీర్చిదిద్దిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నగరవ్యాప్తంగా 709 కిలోమీటర్ల పొడవునా ఉన్న సీఆర్ఎంపీ (కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రా మ్) రహదారులపై కూడా సైక్లింగ్ ట్రాకులు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో భాగంగా లంగర్హౌస్లోని టిప్పుఖాన్ వంతెన నుంచి నానల్నగర్కు వెళ్లే దారిలో 100 మీటర్ల పొడవునా ట్రాక్ను నిర్మించారు. ఈ నాలుగు చోట్ల సైకిల్ ట్రాకుల పనితీరును పరిశీలించి నగరవ్యాప్తంగా వీటిని అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు, ఫిట్నెస్ కోసం ఈ ట్రాక్లు ఉపయోగపడతాయని వైద్యులు సలహా ఇస్తున్నారు.