సిటీబ్యూరో, సెప్టెంబరు 29 (నమస్తే తెలంగాణ):ఉమ్మడి రాష్ట్రంలో ఆ ప్రాంతం నగర శివారులోని ఓ పల్లె. నేడు దేశంలోని కొన్ని ఆదర్శ నగరాలలో అదో నగరం. ఆ నగరంలో ఏ దిక్కు చూసినా అందమైన పార్కులు తారాసపడతాయి. ఇక డంపింగ్ యార్డులో దుర్వాసనకు బదులు సందర్శకులు సేదాతీరేలా ప్రత్యేక బెంచ్లు, వాక్వేలు, చిల్డ్రన్స్ ప్లే పార్కు, ఓపెన్ జిమ్ దర్శనమిస్తాయి. సుమారు 260 కి.మీ. మేర రోడ్లు విస్తరించి, ఇరువైపులా అందమైన పూల మొక్కలు, ఆకుపచ్చని చెట్లు హరివిల్లులా కనిపిస్తాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ఓ చాలెంజ్లా స్వీకరించి, సంపూర్ణంగా అమలు చేస్తూ జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిలో అనేక అవార్డులను దక్కించుకుంటున్నది.
మహానగరానికి కూతవేటు దూరంలో, వరంగల్ జాతీయ రహదారికి ఇరువైపులా విస్తరించి ఉన్న ఆ ఆదర్శనగరం పేరు ‘పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్’. పల్లె నుంచి పట్టణంగా.. పట్టణం నుంచి ఆదర్శ నగరంగా ఎదగి, అభివృద్ధికి చిరునామాగా మారిన పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ తాజాగా ‘ఇండియన్ స్వచ్ఛతా లీగ్’లో ప్రథమ స్థానంలో నిలిచింది. అక్టోబర్ 1న ఢిల్లీలో అవార్డు అందుకోనున్న నేపథ్యంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 26 డివిజన్లు ఉన్నాయి. ప్రతి డివిజన్లో ఖాళీ స్థలాలను గుర్తించి సుమారు 3 నుంచి 4 పార్కుల చొప్పున, కేవలం 365 రోజల్లో 100 పార్కులను అభివృద్ధి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. కార్పొరేషన్ పరిధిలో సుమారు 10-15 పార్కులు చిన్నారులకు, ఓ నాలుగైదు వృద్ధులకు, అలాగే మహిళలకు ప్రత్యేక పార్కులను అభివృద్ధి చేశారు. ఈ పార్కులలో ఎడారి మొక్కలతో కూడిన ఓ రాక్ గార్డెన్ను కూడా ఏర్పాటు చేయటం విశేషం.
సంపూర్ణంగా తడి, పొడి చెత్త సేకరణ..
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రతి రోజు సుమారు 38 టన్నుల గృహ వ్యర్థాలు సేకరిస్తారు. సుమారు 260 కి.మీ.మేర విస్తరించి ఉన్న రహదారులను క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచేందుకు ప్రతి 2 కిలోమీటర్లకు ఒక పారిశుధ్య కార్మికుడు చొప్పున 125 మంది కార్మికులను నియమించారు. అలాగే 127 చెత్త సేకరణ వాహనాలపై 225 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీళ్ల ద్వారా సేకరించిన చెత్తను రూ.2 కోట్లతో నిర్మించిన ‘సమీకృత వ్యర్థాల శుద్ధీకరణ పార్కు’లో డంప్ చేసి పొడి చెత్తను రాంకీవాళ్లకు అందిస్తున్నారు. తడి చెత్తను సేంద్రీయ ఎరువుగా మార్చి కార్పొరేషన్ పరిధిలోని చెట్లు, మొక్కలకు సరఫరా చేస్తున్నారు.
మరిన్ని ప్రత్యేకతలు
నిరుద్యోగ మహిళలకు ఎంఎస్ ఆఫీస్, టైలరింగ్, జ్యూట్ బ్యాగుల తయారి, బట్ట సంచులు, నిరుద్యోగ యువకులకు ఏసీ రిపేర్లో శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 500 మంది ఈ సెట్విన్ కేంద్రంలో శిక్షణ తీసుకుని స్వయం ఉపాధి పొందుతున్నారు.
‘ఎనిమల్ వెల్ఫేర్ సొసైటీ’ సంయుక్తంగా సుమారు రూ.15 లక్షల వ్యయంతో ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. కుక్కల సంతాన నియంత్రణ శస్త్ర చికిత్సలతో పాటు, రోగాల బారిన పడ్డ కుక్కలకు చికిత్స అందిస్తున్నారు.
కార్పొరేషన్ పరిధిలోని ప్రతి కాలనీలో ప్రజలు, పోలీసుల భాగస్వామ్యంతో 100 శాతం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 26 డివిజన్ల పరిధిలో సుమారు 1.5 కోట్లను వెచ్చించి 300 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
పీర్జాదిగూడలో ప్రత్యేకంగా 15 కేఎల్డీ గల ఎఫ్ఎస్టీపీ (ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్)ను నిర్మించారు. అలాగే హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ కోసం మోడల్ వైకుంఠధామంతో పాటు మరో 8 వైకుంఠధామాలను ఏర్పాటు చేశారు. 185.3 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 15.10 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లను నిర్మించారు. 206.86 కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ప్రతి పార్కు వద్ద ఓపెన్ జిమ్లు, 105 స్ట్రీట్ వెండర్ షాపులు తదితర అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
రెండేండ్ల క్రితం పీర్జాదిగూడ కార్పొరేషన్ను వరద నీరు ముంచెత్తడంతో మంత్రి కేటీఆర్ స్వయంగా పర్యటించి బోడుప్పల్, పీర్జాదిగూడ వరద నీరు నేరుగా మూసీలో కలిపేందుకుగాను రూ.110 కోట్లను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పనులు జరుగుతున్నాయి. అలాగే పీర్జాదిగూడ కమాన్ నుంచి పర్వతాపూర్ క్రాస్ రోడ్డు వరకు రూ.25.32 కోట్లతో నాలుగులేన్ల రోడ్డు, రూ.7.5 కోట్లతో ఇంట్రిగ్రేటెడ్ మార్కెట్ యార్డును ఏర్పాటు చేశారు.
రూఫ్ గార్డెన్లకు చేయూత..
పీర్జాదిగూడ పట్టణంలో కాలనీల ప్రజలు తమ ఇండ్లపై రూఫ్, టెర్రాస్ గార్డెన్లను ఏర్పాటు చేసుకునే వారికి సుమారు రూ. 5వేల వరకు సాయం చేస్తున్నారు. దీంతో వందల సంఖ్యలో రూఫ్ గార్డెన్లను ఏర్పాటు చేసుకుని ఎవ్వరికి వారే కూరగాయలను ఉత్పత్తి చేసుకుంటున్నారని కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఈ రూఫ్ గార్డెన్లకు సేంద్రియ ఎరువును ఉచితంగా అందిస్తున్నట్లు వారు చెప్పారు.
మోడల్ నగరంగా పీర్జాదిగూడ
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి సహకారంతో పీర్జాదిగూడ నగరాన్ని ఒక ఆధునిక నగరంగా అభివృద్ధి చేస్తున్నాం. గతంలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో వచ్చిన అవార్డులతో పాటు తాజాగా జాతీయ స్థాయిలో అవార్డు రావడం సంతోషంగా ఉంది. ప్రజల సహకారంతో తడి, పొడి చెత్తను 100శాతం వేరు చేస్తున్నాం. ప్రభుత్వ కార్యక్రమాలను 100 శాతం అమలు చేయడంతో పాటు కార్పొరేషన్ పరిధిలోని ప్రతి పౌరుడు ఆరోగ్యవంతమైన జీవనం గడిపేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం.
– జక్కా వెంకట్రెడ్డి, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్