సిటీబ్యూరో, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ):నిద్రకు ఉపక్రమించడం ఓ సాహసం. నిద్రలేమి ఓ నరకం. నిద్ర గురించి ఓ తత్వవేత్త మాటల్లో చెప్పాలంటే… ‘నిద్ర వచ్చిందంటే అన్నింటినీ మరిచిపోయేలా చేస్తుంది.. రాకపోతే ఎన్నింటినో గుర్తు చేస్తుంది. ఎంత చిత్రమో కదా’. నిశితంగా నిద్రపోగల అదృష్టం ఏ కొద్దిమందికో తప్ప అందరికీ దొరకడం లేదు. నిద్రపోకుండా ఉండటమంటే చేజేతులా మృత్యుదేవతను ఆహ్వానించడమేనని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అర్ధరాత్రి దాటినా రెప్ప మూతబడని వాళ్లు… కష్టపడి నిద్ర తెచ్చుకున్నా… పట్టుమని 2 గంటలు కూడా పడుకోలేని వాళ్లు ఎక్కువైతున్నారు. నిద్రలేమితో ఆరోగ్యం పాడై ఆస్పత్రుల చుట్టూ తిరిగే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నిద్రపై దృష్టిసారించాలని.. అందుకు కొన్ని టిప్స్ పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
నిద్రపోకుండా ఉంటే శరీరం ఒత్తిడికి గురవుతుంది. బీపీ పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పడిపోతాయి. మరణమూ సంభవిస్తుంది. శరీరాన్ని, మెదడునీ ఆరోగ్యంగా ఉంచి అవయవాల పనితీరుని, బరువుని, మనసు బాగోగులను క్రమబద్ధం చేసే పనులన్నీ నిద్రలోనే జరుగుతాయి. ఇవన్నీ జరగాలంటే కనీసం 7-9 గంటల నిద్ర అవసరం. ఇందులో ఏ మాత్రం తగ్గినా అది నిద్రలేమికి సంకేతం. నిద్రపోతున్నప్పుడు చర్మం సహా శరీరంలోని అన్ని భాగాలు మరమ్మతులు చేసుకుంటాయి. వ్యర్థాలను తొలగించుకుని బయటకు పంపిస్తుంటాయి. మతిమరుపునకు కారణమయ్యే అమైలాయిడ్ ప్రొటీన్ కూడా ఆ వ్యర్థాల్లో ఒకటి. నిద్ర తగ్గితే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది. కోపం, ఒత్తిడి, ఆందోళన పెరిగి అనుబంధాల మీద, విధి నిర్వహణ మీద ప్రభావం చూపుతుంది.
యాక్టివిటీ తగ్గించుకోవాల్సిందే..
రాత్రి ఆలస్యంగా పడుకుని ఉదయం ఆలస్యంగా నిద్రలేచేవారిలో స్లీప్ సైకిల్ దెబ్బతిని నిద్ర పట్టదు. మంచం మీద కూర్చుని టీవీ చూడటం, లాప్టాప్లో పనిచేయడం, ఫోను వాడటం వల్ల వాటి నుంచి వెలువడే నీలి కాంతి మెలటోనిన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఎప్పుడైతే మనం మంచం మీద కూర్చుని పని చేయడం మొదలుపెడుతున్నామో మెదడు కూడా పని చేయడం ప్రారంభిస్తుంది. ఫలితంగా నిద్ర కరువయ్యే పరిస్థితి. ఉరుకులు, పరుగుల జీవితంతో నగరవాసుల్లో ఎక్కువ మందిని నిద్రలేమి సమస్య వేధిస్తోంది. అనారోగ్య సమస్యలు, ఇతర ఇబ్బందులతో మద్యపానం, ధూమపానం, మత్తుపదార్థాల సేవనం వంటి చెడు అలవాట్లు ఎక్కువ మందిలో ప్రశాంతమైన నిద్రను దూరం చేస్తున్నాయి.
ఇవి పాటిద్దాం..
‘10-3-2-1-0’ సూత్రాన్ని పాటిస్తే సులభంగా నిద్రలోకి జారుకోవచ్చని ప్రముఖ వైద్యుడు డాక్టర్ నవనీత్ సూద్ తెలిపారు. నిద్రకు ఉపక్రమించే పది గంటల ముందు కెఫిన్, టీలు తీసుకోకూడదు. 3 గంటల ముందు పరిమితస్థాయిలో ఆహారాన్ని తీసుకోవాలి. నిద్రపోయే 2 గంటల ముందు వరకు పనులను తక్కువగా చేయాలి. ఎక్కువ ఒత్తిడి కలిగించే పనుల జోలికి వెళ్లకూడదు. గంట ముందర వరకు మొబైల్, లాప్టాప్ తదితర పరికరాల వాడకానికి దూరంగా ఉండాలి. 0-ఇక మీ నిద్రలేమి సమస్యను మీరు అధిగమించే అదృష్ట క్షణాలు మొదలవుతాయి. ప్రతిరోజు నిద్రపోవడానికి మేల్కొనడానికి కచ్చితమైన సమయం పాటించాలి. పగటి నిద్ర 45 నిమిషాలకు మించకూడదు. మద్యపానం చేయరాదు. సౌకర్యవంతమైన దిండు, పరువులతో పాటు పడగ గదికి తగిన వెంటిలేషన్ తప్పనిసరి అని డాక్టర్ నవనీత్ సూద్ సూచిస్తున్నారు.