సిటీబ్యూరో, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): నగర రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా.. ప్రజల సహకారంతో సాఫీ ప్రయాణాలు సాగేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు చెక్పెట్టేందుకు 3ఈలు (ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్)తో పాటు రోప్(రీమూవల్ ఆఫ్ అబ్స్రక్టీవ్ పార్కింగ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్)ను అమలు చేస్తున్నట్లు చెప్పారు. గురువారం బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొవిడ్-19 తరువాత ప్రజలు వ్యక్తిగతమైన వాహనాలు ఎక్కువగా కొనుగోలు చేశారన్నారు. 2020 జనవరిలో 64 లక్షల వాహనాలుండగా, 2022 ఆగస్టు వరకు 76.65 లక్షలకు పెరిగినట్లు వెల్లడించారు. ప్రజల నుంచి డయల్ 100కు వస్తున్న ఫిర్యాదుల్లో 80 శాతం వరకు ట్రాఫిక్కు సంబంధించనవే ఉంటున్నాయన్నారు. రోడ్లపై తోపుడు బండ్లు పెట్టే వారు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కలుగనీయవద్దని, అలాగే ఆటోలు, ఆర్టీసీ బస్సులు వాళ్లకు కేటాయించిన చోటే ఆపాలని సూచించారు. ట్రాఫిక్ విభాగంలో యువకులైన సిబ్బందిని ఎస్హెచ్వోలు, ఎస్సైలుగా నియమిస్తున్నామని, మరో వంద మంది హోంగార్డులను ట్రాఫిక్ విభాగానికి పంపించనున్నట్లు పేర్కొన్నారు. కార్ హెడ్క్వార్టర్స్లో ఉన్న మహిళా కానిస్టేబుళ్లకు కూడా ట్రాఫిక్ విధులు కేటాయిస్తామన్నారు. అనంతరం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కొత్త లోగోను, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు రూపొందించిన షార్ట్ ఫిలిం సీడీలను ఆయన ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.
నిబంధనలు పాటించని పబ్లపై చర్యలు
పార్కింగ్ లేని వ్యాపార సముదాయాలతో పాటు నిబంధనలు పాటించని పబ్లపై చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. అనేక పబ్లకు సంబంధించిన వాహనాలు రోడ్లపైనే పార్కు చేస్తున్నారని ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని, ఈ నేపథ్యంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ విభాగం అధికారులు పబ్స్లో తనిఖీలు నిర్వహిస్తారని సీపీ తెలిపారు.