కీసర, సెప్టెంబర్ 29: మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాలలోని నాట్కాన్ చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిందే. వీరిలో హరిహరన్ మృతదేహాన్ని మాత్రమే బయటకు తీయగలిగారు. గురువారం గజ ఈతగాళ్ల సాయంతో మరో ఇద్దరు బాలాజీ, ఉబేద్ మృతదేహాలను వెలికితీశారు. మృతులు హరిహరన్, ఉబెద్, బాలాజీ ఓ ఇంజినీరింగ్ కళాశాలలో డిప్లొమా థర్డ్ ఇయర్ చదువుతున్నారు. వీరిలో హరిహరన్, ఉబెద్ బర్త్డే ఉండటంతో ముగ్గురు కలిసి బుధవారం కీసర మండలం చీర్యాలలోని శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో పూజలు చేసి.. పక్కనే ఉన్న నాట్కాన్ చెరువులో ఈతకెళ్లి మృత్యువాతపడ్డారు. కాగా, బాధిత కుటుంబాల రోదనలు మిన్నంటాయి. వారు గుండెలవిసేలా రోదించడం చూపరులను కంటతడి పెట్టించింది. ఉబేద్ తల్లిదండ్రులు చంపాపేట్ ముస్లింబస్తీలో నివాసముంటున్నారు. వీరు కూలీనాలి చేసుకొని కొడుకును చదివించుకుంటున్నారు. కొడుకును విగతజీవిగా చూసి..బోరున విలపించారు. సాయంత్రం ఇంటికోస్తానని చెప్పిన కొడుకును ఇలా చూస్తామనుకోలేదన్నారు. చేతికొచ్చిన కొడుకు చనిపోవడంతో బాలాజీ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా, ఘటనాస్థలిని మంత్రి మల్లారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిర లక్ష్మీనారాయణ, ఎంపీడీవో పద్మావతి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, స్థానిక సర్పంచ్ తుంగ ధర్మేందర్లతో కలిసి పరిశీలించారు. బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందేలా చూస్తానని మంత్రి హామీ ఇచ్చారు.