నాణ్యతాప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై స్పెషల్ డ్రైవ్ కల్తీ ఆహార పదార్థాలు దృష్టికి వస్తే
040-21111111 కాల్ చేయండి
సిటీబ్యూరో, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : పరిశుభ్రమైన వాతావరణంలో.. చక్కని భోజనం అందించని హోటళ్లు, రెస్టారెంట్లపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఉక్కుపాదం మోపాలని జీహెచ్ఎంసీ సంకల్పించింది. ఇందుకు 30 సర్కిళ్లకు 22 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లకు బాధ్యతలు అప్పగించింది. నాణ్యమైన భోజనం అందించని, పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై విస్తృత తనిఖీలు ద్వారా జరిమానాలు, సీజ్ లాంటి చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడైనా నాసిరకం, కల్తీ, అపరిశుభ్రతతో హోటళ్లు, రెస్టారెంట్లు ఉంటే 040-2111 1111 నంబర్కు ఫోన్చేసి సమాచారం ఇవ్వాలని జీహెచ్ఎంసీ అధికారులకు ప్రజలకు కోరారు.
కోటికి పైగా జనాభా కలిగిన గ్రేటర్లో దాదాపు 12 నుంచి 14 వేల వరకు హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయిల్ నుంచి మొదలు ఉప్పు వరకు నాణ్యమైన వాటిని వినియోగించి నిర్వాహకులు క్వాలిటీ ఫుడ్ను అందించాలి. జీహెచ్ఎంసీ స్టాంప్ వేసిన మాంసాన్ని వాడాలి. కానీ, నియమ నిబంధనలను పక్కన పెట్టి.. ధనార్జనే ధ్యేయంగా హోటళ్లు, రెస్టారెంట్లు నిర్వాహకులు వ్యాపారాన్ని సాగిస్తున్నారు. వంటగదుల్లో పరిశుభ్రత పాటించడం లేదు. ఈ జాబితాలో చిన్న హోటళ్లు నుంచి బడా హోటళ్ల నిర్వాహకులు కూడా ఉన్నారు. ఇలాంటి సమస్యలపై జీహెచ్ఎంసీకి నిత్యం దాదాపు 10కి పైగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ మేరకు స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి నాణ్యత పాటించని హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులకు తొలుత జరిమానాలు.. ఆ తర్వాత సీజ్ చేయడం లాంటి చర్యలు చేపట్టనున్నారు.