మేడ్చల్, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో మంగళవారం ఘనంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. విద్యాశాఖ, మత్స్యశాఖ, లేబర్ డిపార్ట్మెంట్ ఆధ్వరంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో అధికారులతోపాటు మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. జిల్లా నుంచి విద్యార్థులు తరలివచ్చి బతుకమ్మ, కోలాటాలు, ఆటపాటలతో సందడి చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి విద్యార్థులతో కలిసి కోలాటం ఆడటం ఆకర్షణగా నిలిచింది. బతుకమ్మలను రంగురంగుల పూలతో పేర్చారు. జిల్లా విద్యాధికారి విజయకుమారి, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, వివిధ విభాగాల మహిళా అధికారులు పాల్గొన్నారు.
బతుకమ్మ వేడుకలను ఆనందంగా జరుపుకోవాలి : కలెక్టర్
మేడ్చల్ కలెక్టరేట్/మేడ్చల్ రూరల్, సెప్టెంబర్ 27 : బతుకమ్మ వేడుకలను ఆనందోత్సవాలతో జరుపుకోవాలని కలెక్టర్ హరీశ్ అన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో మంగళవారం బతుకమ్మ సండురాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో కలెక్టర్ పాల్గొని చిన్నారులతో ముచ్చటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులు బతుకమ్మ పండుగను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నాగారం సెరినిటి పాఠశాల చైర్మన్ నోముల జంగిరెడ్డి ముఖ్య కార్యదర్శి నోముల వసంతను, విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఈవో విజయకుమారి, ఏవో వెంకటేశ్వర్లు, మహిళా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.