సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామంటూ నమ్మించి ఒక వ్యాపారి దృష్టి మళ్లించి రూ. 60 లక్షలు కొట్టేసిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను నేరేడ్మెట్లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్ మీడియాకు వెల్లడించారు. సరూర్నగర్లోని వీవీనగర్లో నివాసముండే తళ్లూరి వెంకటేశ్వరరావు రియల్ ఎస్టేట్ వ్యాపారి. అతడికి రియల్ ఎస్టేట్ బ్రోకర్, విద్యానగర్కు చెందిన గజ్జెల మహేశ్ పరిచయమయ్యాడు. మహేశ్ స్నేహితుడు మహ్మద్ రియాజ్ అలియాస్ అనిల్ ఎల్బీనగర్లో బట్టల వ్యాపారి. నెల రోజుల కిందట తనకు బాపట్లలో ఇరగడిండ్ల వానీశ్ కుమార్ అలియాస్ రాజారెడ్డి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.. అతడు తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానంటూ నమ్మిస్తూ అమాయకులను ఈజీగా మోసం చేస్తాడని చెప్పాడు.
1.5 కేజీ గోల్డ్.. రూ.60 లక్షలకే..
మహేశ్ బాధితుడైన వెంకటేశ్వర్రావును నమ్మించి కిలో బంగారం రూ. 40 లక్షలకే తీసుకునేలా ఒప్పించాడు. ఈ విషయాన్ని రియాజ్ వానీశ్ కుమార్కు చెప్పడంతో 15 రోజుల కిందట వెంకటేశ్వర్రావుకు వాట్సాప్లో బంగారం ఉన్న ఒక వీడియోను పంపించాడు. నమ్మకం కుదరడంతో బంగారం తీసుకొచ్చి, డబ్బు తీసుకెళ్లాలంటూ వెంకటేశ్వర్రావు సూచించాడు. దీంతో మహేశ్, రియాజ్, వానీశ్, విశాఖపట్టణానికి చెందిన కర్రి కనకా రావు, విజయవాడకు చెందిన రవి, డబీర్పురకు చెందిన సురేందర్, ఖమ్మంకు చెందిన షేక్ సైదులు, అనుమోలు సైదులు, నెల్లూర్కు చెందిన ప్రసన్న ఒక ముఠాగా ఏర్పడ్డారు.
దృష్టి మళ్లించింది ఇలా..
నిందితులు తమ వెంట తెచ్చుకున్న సూట్కేస్లో రెండు బ్యాగ్లు ఉన్నాయి. ఆ రెండు బ్యాగులు ఒకే రకంగా.. ఒకే రకమైన తాళాలతో ఉన్నాయి. అందులోని ఒక బ్యాగ్లో నకిలీ నోట్ల కట్టలు పెట్టారు. సూట్కేస్ కింది వైపు నకిలీ నోట్లు ఉన్న బ్యాగును పెట్టి.. తాళంవేసి అనుమానం రాకుండా ఇంట్లోకి వెళ్లారు. బాధితుడి ముందు సూట్కేసు తెరిచారు. బాధితుడు ఇచ్చిన అసలు నోట్లు లెక్కించి.. మరో బ్యాగ్లో పెట్టారు. ఆ బ్యాగుకు బాధితుడి ముందే తాళం వేశారు. బాధితుడిని మాటల్లో పెట్టి బ్యాగులను మార్చేశారు. నకిలీ నోట్లు ఉన్న బ్యాగును బయటపెట్టి.. అసలు నోట్లు ఉన్న బ్యాగును సూట్కేసులో పెట్టుకున్నారు. మరికొద్ది సేపు మాట్లాడి.. బంగారం రావడానికి సమయం పడుతుంది.. మీ డబ్బు ఈ బ్యాగులోనే ఉంది.. బంగారం ఇచ్చి నగదు తీసుకెళ్తామని నమ్మించారు.
నకిలీ నోట్లు ఉన్న బ్యాగును అతడి చేతికి ఇచ్చి, అసలు నోట్లు ఉన్న బ్యాగును తీసుకువెళ్లారు. రెండు బ్యాగులు ఒకే మాదిరిగా ఉండటం.. తాళం కూడా వేసి ఉండటంతో బాధితుడికి అనుమానం రాలేదు. ఆలస్యంగా మోసాన్ని గ్రహించిన బాధితుడు సరూర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఎస్ఓటీ ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ సుధాకర్ బృందం సరూర్నగర్ పోలీసులతో కలిసి దర్యాప్తు చేపట్టింది. నిందితులు మంగళవారం విద్యానగర్లో డబ్బును పంచుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఎస్ఓటీ పోలీసు లు వల పన్ని ఈ ముఠాలోని 8 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 45.10 లక్షల నగదు, సెల్ఫోన్లు, కారు, బైక్, నకిలీ నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలాఉండగా.. నిందితుల్లో కర్రి కనక రాజుపై రెండు తెలుగు రాష్ర్టాలో 7, వానీశ్ కుమార్పై 14 కేసులు ఉన్నాయి. ఈ సమావేశంలో ఎల్బీనగర్ ఇన్చార్జి డీసీపీ వెంకటేశ్వర్లు, ఎస్ఓటీ డీసీపీ మురళీధర్, ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్రెడ్డి, సరూర్నగర్ ఇన్స్పెక్టర్ సీతారాం, డీఐ రవిబాబు, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ ఏ.సుధాకర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
సూట్కేసులో డబ్బు పెట్టి..
ఈ నెల 20వ తేదీన మహేశ్, కనక రాజు, ప్రసన్న ఆటోలో బాధితుడి ఇంటికి వెళ్లగా.. మిగతా వాళ్లంతా ఆ చుట్టు పక్కల ప్రాంతంలో ఉన్నారు. బాధితుడి ఇంట్లోకి వెళ్లిన వారు మాట్లాడుతూ.. మీ వద్ద డబ్బు ఉన్నదని నిర్ధారించుకున్న తర్వాతే బంగారం తెచ్చి ఇస్తామంటూ నమ్మించారు. ఈ ముఠా ఒక సూట్ కేసులో రెండు బ్యాగులను తీసికెళ్లింది. బాధితుడు నోట్ల కట్టలు తెచ్చి ముందు పెట్టాడు. నోట్లు లెక్కించిన నేరగాళ్లు.. ఓ బ్యాగులో నోట్లు పెట్టారు. కొద్ది సేపటి తర్వాత బంగారం రావడానికి మరో గంట పడుతుందంటూ.. మీ డబ్బు బ్యాగ్ మీ వద్దే ఉంచుకోమంటూ చెప్పి వెళ్లిపోయారు. వెళ్లిన వారు తిరిగి రాకపోవడంతో బాధితుడు వారికి ఫోన్ చేయగా.. అన్ని ఫోన్లు స్విచాఫ్ చేసి ఉన్నాయి. బ్యాగ్ను తెరిచి చూడటంతో అందులో నోట్ల కట్టలకు బదులు నకిలీ నోట్ల (పేపర్లు) బండిల్స్ కనిపించాయి.