సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రోజు రోజుకు నగర విస్తరణ నేపథ్యంలో హైదరాబాద్లో పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. వారిని దృష్టిలో పెట్టుకుని నగరంలోని అన్ని పర్యాటక,ఆధ్యాత్మిక ప్రాంతాలు, చరిత్రాత్మక కట్టడాలను వీక్షించేలా ఆర్టీసీ గ్రేటర్ జోన్ అధికారులు ప్రత్యేక ‘హైదరాబాద్ దర్శన్’ పేరుతో ఒక ప్రత్యేక బస్సు సర్వీసును అందుబాటులోకి తెచ్చారు. ఈ మేరకు మంగళవారం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ దర్శన్ ప్రత్యేక సర్వీసును లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. పర్యాటకుల కోసం శని,ఆదివారాల్లో ఈ సర్వీసులను నడుపుతున్నట్లు ఆర్టీసీ సికింద్రాబాద్ రిజీయన్ మేనేజర్ సీహెచ్.వెంకన్న తెలిపారు.ఆన్లైన్ ద్వారా పర్యాటకులు టిక్కెట్లు బుక్ చేసుకోవడం కోసం www.tsrtconline.in సంప్రదించాలన్నారు.అయితే ప్రారంభ ఆఫర్ కింద చార్జిల్లో 10శాతం డిస్కౌంట్ ప్రకటించినట్లు సికింద్రాబాద్ ఆర్ఎం తెలిపారు. సమాచారం కోసం 040-23450033 లేదా 040-69440000 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు.